సాక్షి టీవి ప్రసారాలు నిలిపివేత: జగన్ చేతికి అస్త్రం
అమరావతి: ముద్రగడ దీక్షను ప్రసారం చేశారని ఏపీలో సాక్షి టివీతోపాటు మరో రెండు టీవీ ఛానళ్ల ప్రసారాలను నిలిపివేయడాన్ని రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని పేర్కొన్నారు. ఎప్పుడూ మీడియా స్వేచ్ఛపై మాట్లాడే చంద్రబాబుకు ఇది ఇబ్బంది కలగించే వ్వవహారమేనని అంటున్నారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన మంత్రులు ప్రభుత్వం స్వయంగా సాక్షి ఛానెల్ ప్రసారాలను నిలిపివేసిందని చెప్పడంతో తీవ్ర దుమారం చెలరేగుతోంది. సాక్షి ప్రసారాల నిలిపివేతతో జగన్ చేతికి మరో అస్త్రం దొరికినట్లు అయింది. ఇప్పటి వరకు మీడియాతో స్నేహపూర్వక వైఖరిని ప్రదర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముద్రగడ దీక్ష వ్యవహారంలో మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛపై పరిధి దాటారని పలువురు రాజకీయ పండితులు చెబుతున్నారు.
ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సైతం ఈ వ్యవహారంలో చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరు ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. అనుకూల మీడియాకు ముద్రగడ వార్తలను ప్రసారం చేయొద్దంటూ చంద్రబాబు ఆదేలిచ్చారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ భావప్రకటన స్వేచ్ఛను హరిస్తూ సాక్షి టీవీతోపాటు మరో రెండు చానళ్ల ప్రసారాలను కట్ చేయడం దారుణమని అన్నారు.
మీడియా ప్రసారాలను నిలిపేయడం సరికాదని చెప్పిన జగన్ ఈరోజు సాక్షి చానల్ ప్రసారాలను కట్ చేసిన ప్రభుత్వం భవిష్యత్తులో మిగితా చానళ్లను కట్ చేయరని గ్యారెంటీ లేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో దీనిని చీకటిరోజుగా అభివర్ణించిన జగన్ అందరూ కలసికట్టుగా ప్రభుత్వ చర్యలను ఖండించాలన్నారు.
సాక్షి చానల్ ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కొన్ని పత్రికలు, చానెళ్లు తమకు వ్యతిరేకంగా రాసినా, ఈ విధంగా ఎప్పుడూ వ్యవహరించలేదని జగన్ గుర్తు చేశారు. తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకేలకు చానళ్లు ఉన్నాయి.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా మరో పార్టీకి చెందిన చానల్ను కట్ చేసిన సందర్భాలు లేవని గుర్తు చేశారు. రాష్ట్రంలో కొత్త సంప్రదాయానికి చంద్రబాబు తెరలేపారని, ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. దీన్ని అందరూ ఖండించాలని జగన్ కోరారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ను చూసి కూడా పాఠాలు నేర్చుకోకపోతే ఎలా? అని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.
తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానెళ్లను నిషేధించిన సమయంలో టిడిపి ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పత్రికాస్వేచ్ఛను కేసీఆర్ మంటకలుపుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ నేతలు విమర్శలు కూడా చేశారు. అయితే ఇప్పుడు చంద్రబాబు వరకు వచ్చే సరికే టీడీపీ నేతలు మరోలా మాట్లాడుతున్నారు.
సాక్షి ఛానెల్ ప్రసారాల నిలిపివేతలో తమకు సంబంధం లేదని, అది ఎంఎస్ఓలు తీసుకున్న నిర్ణయమని, దానికి తామెలా కారణమవుతామని తెలంగాణ మంత్రులు ఎదురుదాడి చేసిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. సాక్షి చానెల్ వ్యవహారంలో తమ పార్టీ నాయకత్వం కూడా అదే విధానం అనుసరిస్తుందని అనుకున్నామని తెలిపారు.
అయితే శుక్రవారం ఏపీ మంత్రులు చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు ప్రెస్ మీటి పెట్టి మరీ ప్రభుత్వమే సాక్షి ఛానెల్ ప్రసారాలను నిలిపివేసిందని చెప్పడం కొసమెరుపు.