జగన్ వ్యూహంలో లోపమా: నంద్యాలలో సై, ఎవరిది ?
రాజకీయ వ్యూహం లోపించిన వైయస్ జగన్ వల్ల నంద్యాలలో పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపితే ఫలితం ఎలా ఉంటుందనే విషయంపై ఇప్పటి నుంచే చర్చ నడుస్తోంది.
కర్నూలు: తెలుగుదేశం పార్టీలోకి మారిన భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేయడానికి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సై అంటోంది. అయితే, భూమా నాగిరెడ్డి మరణం ద్వారా లభించే సానుభూతిని, తెలుగుదేశం పార్టీ వ్యూహాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎదురొడ్డి నిలబడగలదా అనేది ప్రశ్న.
ప్రజాప్రతినిధుల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ జగన్ వ్యూహంలోని లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నంద్యాలలో టిడిపిని ఎదుర్కుని నిలబడే వ్యూహరచనను ఆయన చేయగలరా అనే సందేహం ఇప్పటి నుంచే వ్యక్తమవుతోంది.
వైయస్ జగన్ చుట్టూ ఉన్న కోటరీ క్షేత్రస్థాయిలోని వాస్తవాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లడం లేదనే ఆందోళన కార్యకర్తల నుంచి వ్యక్తమవుతోంది. 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన భూమా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఆ మరణాలతో సానుభూతి ఇలా..
భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. 2014 ఎన్నికలకు కొన్ని రోజులు ముందు ఆయన భార్య శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. నాగిరెడ్డి మిగతా సోదరులు కూడా గుండెపోటుతో ప్రాణాలు వదిలారు. నాగిరెడ్డి మరణంతో ఆయన కూతురు అఖిలప్రియపై సానుభూతి వ్యక్తమవుతోంది. ఈ స్థితిలో నంద్యాలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిలబడగలదా...

ఆ సమయంలో అసెంబ్లీలో ఇలా....
భూమా నాగిరెడ్డి మృతికి శాసనసభలో ప్రతిపాదించిన సంతాప తీర్మానం విషయంలో విషయంలో జగన్ తప్పులో కాలేశారనే వాదన వినిపిస్తోంది. ఆ సమయంలో వైసిపి అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేసింది. సభకు వెళితే నాగిరెడ్డి మంచితో పాటు చెడు కూడా చెప్పాల్సి వస్తుందని జగన్మోహన్రెడ్డి మీడియాతో చిట్చాట్లో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య ఆయన రాజకీయ పరిపక్వత లేమికి నిదర్శమని అంటున్నారు. సభలోకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి తన ఛాంబర్లో కూర్చొని ఉన్నారు.

అసెంబ్లీలో కన్నీటి పర్యంతమైన అఖిలప్రియ
ఆ రోజు అసెంబ్లీలో అఖిలప్రియ కన్నీటి పర్యంతమయ్యారు. జగన్పై ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ కదిలించాయి. దు:ఖాన్ని అదిమిపట్టి తండ్రి గురించి మాట్లాడిన అఖిలప్రియను చూసి సభ విషాదంలో మునిగిపోయింది. తన తండ్రి ఆశయాలను నెరవేర్చిన రోజే ఆయన గురించి ఏడుస్తానని భావోద్వేగంతో చెప్పారు. చనిపోయిన వ్యక్తులంటే గౌరవం లేని వారి గురించి మాట్లాడటం అనవసరమని ఆమె జగన్ను ఉద్దేశించి అన్నారు.

అసెంబ్లీలో ఎస్వీ మోహన్ రెడ్డి ఇలా...
సంతాప తీర్మానంపై మాట్లాడుతూ భూమా బావమరిది ఎస్వీ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జగన్ తీరును పట్టిచ్చాయని అంటున్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన కుటుంబం కోసం తాము ఏమేమి చేశామో అందరికీ తెలుసునని ఆన అన్నారు. హుందాగా ఉండే సభలో హుందాతనం లేని వ్యక్తుల గురించి మాట్లాడటం సభా సమయాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందనే దాకా మోహన్ రెడ్డి వెళ్లారు.

వైఎస్ జగన్ అపరిపక్వత...
భూమా నాగిరెడ్డి మృతికి ప్రతిపాదించిన సంతాప తీర్మానం సందర్భంగా అసెంబ్లీని బాయ్కాట్ చేయడం జగన్ అపరిపక్వతకు నిదర్శనమని అంటున్నారు. రేపు నంద్యాల ఉప ఎన్నికల్లోనూ అఖిలప్రియ, ఎస్వీ నాగిరెడ్డి రంగంలోకి దిగితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకత ఎదురవుతుందని భావిస్తున్నారు. దీన్ని జగన్ రాజకీయ వ్యూహంలో లోపంగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications