పార్టీలో రివర్స్: జగన్ దూకుడు తగ్గిందా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల పలువురు పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారా? కుటుంబ సభ్యులు కినుక వహిస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ వైఖరితో పలువురు నేతలు పార్టీకి దూరం జరిగేందుకు సిద్ధమవుతున్నారట. మొదట్లో ఆ పార్టీలోకి వెళ్లేందుకు నేతలు పోటీ పడ్డారని, ఇప్పుడు మాత్రం అందుకు విరుద్ధంగా ఉందంటున్నారు. షర్మిల, వైవి సుబ్బారెడ్డి వంటి వారు కూడా అసహనంతో ఉన్నారట.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతుండటం, జగన్ తీరుతోనే పలువురు అసంతృప్తితో ఉన్నారంటున్నారు. జగన్ తీరు పట్ల మాజీ మంత్రి మారెప్ప బహిరంగంగానే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఓ సామాజికవర్గానికే జగన్ పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నరని, మిగిలిన వారిని పట్టించుకోవడం లేదని, ఆయనకు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి ఏమాత్రం పోలిక లేదని దుయ్యబట్టారు.
వైయస్ జగన్ కోసం మంత్రి పదవిని తృణపాయంగా వదిలేసిన కొండా సురేఖ, మూడేళ్లపాటు జగన్ను సమర్థించిన సబ్బం హరి వంటి వారు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మారెప్ప బయటకు చెప్పినప్పటికీ పలువురు లోలోన మదనపడుతున్నారట. మైసూరా రెడ్డి వంటి సీనియర్ నేతలతో పాటు బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, సోదరి షర్మిల, సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.
జగన్ ఓదార్పు యాత్రకు, షర్మిల పాదయాత్రలకు జనం ఎగబడ్డారు. దీంతో పలువురు రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పోటెత్తారు. నేతల యాత్రలకు పలువురు నేతలే ఖర్చు పెట్టినట్లుగా ప్రచారం కూడా జరిగింది. అయితే, ఇప్పుడు పార్టీ గ్రాఫ్ పడిపోతుండటం, జగన్ కారణంగా కొందరు వెనక్కి తగ్గుతున్నారట.
నర్సాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు వియ్యంకుడు రఘురామ రాజు ఇప్పుడు జగన్ పార్టీ తరపున పోటీ చేసేందుకు వెనకాడుతున్నారట. ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ మొదట విజయవాడ లోక్సభకు పోటీ చేయాలనుకున్నప్పటికీ సర్వే చేయించాక మనసు మార్చుకున్నారట. జగన్ పార్టీ తరఫున అనిల్ సర్దుబాటుకు ప్రయత్నించినా పొట్లూరి మనసు మార్చుకోలేదు. అడుసుమిల్లి జయప్రకాశ్ కూడా వెనక్కి తగ్గారట.
ఒంగోలు సీటు ఇవ్వడానికి నిరాకరించడంతో వైవి సుబ్బారెడ్డి జగన్కు దూరమైనట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక కూర్పులో మాత్రం ఆయన పాత్ర కూడా ఉండటం గమనార్హం. దీంతో టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ పార్టీలో కీలక పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. కడప స్థానంపై ఆశలు పెట్టుకున్న షర్మిల ఇంకా కొంత అసంతృప్తితోనే ఉన్నారంటున్నారు.