జాతీయ పతాకం..ఏకంగా కనుగుడ్డుపైనే
చెన్నై: సాధారణంగా మినియేచర్ ఆర్టిస్టులు.. బియ్యపు గింజ, పెన్సిల్ కొసలు, టూత్ పిక్స్, నీడిల్స్ మీదో తమ కళను ప్రదర్శిస్తుంటారు. వాటిని విభిన్న రీతుల్లో చిత్రీకరిస్తుంటారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఓ మినీయేచర్ ఆర్టిస్ట్.. ఓ అడుగు ముందుకేశాడు. వైవిధ్యంగా తన దేశభక్తిని చాటుకున్నాడు. ఏకంగా తన కనుగుడ్డ మీదే జాతీయ పతకాన్ని చిత్రీకరించుకున్నాడు. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు.
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గత ఏడాది ఆగస్టు 15వ తేదీన ఆరంభమైన ఈ వేడుకలు వచ్చే పంద్రాగస్టుతో ముగియనున్నాయి. దీన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా అనే ఉద్యమాన్ని నడిపిస్తోంది. వజ్రోత్సవ వేడుకల కోసం దేశం యావత్తూ సిద్ధపడుతోంది.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోలాహలం, పండగ వాతావరణం మూడు రోజుల ముందే దేశవ్యాప్తంగా నెలకొని ఉంది. దీన్ని పురస్కరించుకుని ఆ మినీయేచర్ ఆర్టిస్ట్.. తన దేశభక్తిని విభిన్నంగా చాటుకున్నారు. ఆయన పేరు యుఎంటీ రాజా. వయస్సు 52 సంవత్సరాలు. అద్దంలో చూసుకుంటూ మువ్వన్నెల జెండాను తన కనుగుడ్డుపై పెయింట్ వేసుకున్నాడు. దీనికోసం 16సార్లు ఆయన ప్రయత్నించాడు.
మొదట- గుడ్డులోని తెల్లసొన పలుచని పొరకు మైనంతో జాతీయ జెండా రంగులను పూశాడు. అనంత దాదాపు 20 నిమిషాల పాటు కంటిలో పొరను ఉంచాడు. ఆ పెయింట్ కనుగుడ్డుపై ప్రింట్ అయింది. ఈ ఫీట్ చేయడానికి ముందు ఆయన కంటి డాక్టర్ సలహాలను తీసుకున్నాడు. కోయంబత్తూర్కు చెందిన ఐ స్పెషలిస్ట్ డాక్టర్ ఏ శశికళ ఎలిజబెత్ను సంప్రదించారు. జాతీయ పతాకంలో వాడిన రంగుల వల్ల ఇబ్బందుల గురించి తెలుసుకున్న తరువాత.. దీనికి సిద్ధపడ్డాడు.