సేద్యానికి చేయూత: జాతీయ స్థాయిలోనే నేరుగా నగదు బదిలీ!
న్యూఢిల్లీ: సుమారు 130 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో వ్యవసాయమే అత్యధికులకు జీవనాధారం. కంప్యూటర్ కాలంలోనూ భరతభూమిపై నేలను నమ్ముకున్న కర్షక సోదరులు తక్కువేం కాదు. ప్రపంచ బ్యాంకు సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకు మెరుగుపడినా.. పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నా.. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకున్న ప్రాధాన్యం మాత్రం చెక్కుచెదరడం లేదు. భారతీయతలో అంతగా మమేకమైంది పంటల సాగు. అలాంటిది రైతులకు రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులేనన్న సంకేతాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
తాజా ఆర్థిక సర్వే ఇదే ఆందోళనను వ్యక్తం చేసింది. అందుకే ఈసారి బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందన్న అంచనాలు అంతటా వినిపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2018-19)గాను గురువారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ను ప్రవేశ పెడుతుండగా, మోదీ సర్కార్కు ఇదే చివరి పూర్తికాల బడ్జెట్.

వ్యవసాయంపై ప్రమాద ఘంటికలు మోగుతున్నదని హెచ్చరికలు
దీంతో రైతన్నలను ఆకట్టుకునే ప్రకటనలకు కొదువ ఉండదంటున్నారు నిపుణులు. అందులోనూ త్వరలో ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలుండటంతో తప్పక ఇది రైతాంగం మెచ్చే బడ్జెటే అవుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. రైతులకు ఉపయోగపడని వృద్ధిరేటు దండుగ అని ఇటీవలే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా అన్నారు. ఇటీవల గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో రూరల్ ప్రాంతాలు దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం తాను పార్లమెంట్కు సమర్పించిన ఆర్థిక సర్వే నివేదిక సైతం వ్యవసాయానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని హెచ్చరించింది. వాతావరణ మార్పులతో రైతుల ఆదాయం 25 శాతం వరకు పడిపోయే వీలుందన్నది. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్లో జైట్లీ అధికంగా నిధులను కేటాయించే అవకాశాలే ఉన్నాయని మెజారిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వ్యవసాయ విద్య, పరిశోధనలకు మరిన్ని నిధులు కేటాయింపునకు చాన్స్
ఫసల్ బీమా యోజనకు రూ.11,000 కోట్ల నిధులివ్వాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కోరుతుండగా, అంతకంటే ఎక్కువే దక్కుతాయన్న అంచనాలున్నాయి. వ్యవసాయ విద్య, పరిశోధనల కోసం ఈ బడ్జెట్లో మరిన్ని నిధులను కేటాయించే అవకాశాలూ కనిపిస్తున్నాయి. నీటిపారుదలకు అధిక కేటాయింపులు, గోదాముల నిర్మాణానికి రాయితీలివ్వనున్నారు. అలాగే రైతుల ఆదాయం రెండింతలు చేయాలన్న లక్ష్యంపైనా జైట్లీ శ్రద్ధ వహించనున్నారు. ఇక వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో ఇప్పటికే ఎరువులు తదితర వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను భారం తగ్గించారు జైట్లీ. వ్యవసాయ రుణాల రద్దు డిమాండ్లూ ఆయా రాష్ర్టాల నుంచి వినిపిస్తుండగా, ఇది చేస్తే ప్రభుత్వ ఖజానాపై వ్యయభారం పెరుగుతుందని, బ్యాంకులపై పెనుభారం పడుతుందని ఆర్బీఐ హెచ్చరిస్తున్నది. అయినప్పటికీ దీనికి సంబంధించి కూడా బడ్జెట్లో స్పష్టమైన ప్రకటన రావచ్చన్న అభిప్రాయాలున్నాయి.

జాతీయ ద్రుష్టిని ఆకర్షిస్తునన తెలంగాణ ప్రభుత్వాలు
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన రైతన్న కష్టాలు తొలగించాల్సిన అవసరం ఎంతో ఉన్నదన్న తాజా ఆర్థిక సర్వే.. చాలా అంశాల్లో తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలకు అద్దం పట్టింది. వ్యవసాయం విషయంలో ప్రస్తుతం తెలంగాణ సర్కార్ విధానాలు భేష్షుగ్గా ఉన్నాయని పేర్కొన్నది. మిషన్ కాకతీయ, నీటిపారుదల ప్రాజెక్టులు, నిరంతర విద్యుత్, కనీస మద్ధతు ధర, ఎరువులు, విత్తనాల రాయితీ, డ్రిప్ ఇరిగేషన్, గోదాముల నిర్మాణం వంటివి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ తరహా చర్యలన్నింటినీ దేశవ్యాప్తంగా రైతుల కోసం అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆర్థిక సర్వే రూపకర్త, ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ అభిప్రాయపడటం గమనార్హం.

జాతీయ స్థాయిలో అమలు దిశగా చౌహాన్ పథకం?
వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నివారణకు బడ్జెట్లో మధ్యప్రదేశ్ ప్రభుత్వ భవంతర్ భుగ్తన్ యోజన తరహా పథకాన్ని జైట్లీ ప్రకటించే అవకాశాలున్నాయి. రైతు రక్షణ చర్యల్లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకునే వీలున్నది. చాలా రాష్ర్టాల్లో పంటల ధరలు ఏమాత్రం లాభసాటిగా లేకపోవడంతో కనీస మద్ధతు ధర (ఎంఎస్పీ) దక్కని రైతన్నలకు పరిహారం అందే మార్గాలపై కేంద్రం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే గతేడాది మధ్యప్రదేశ్ ప్రభుత్వం సరికొత్తగా అమల్లోకి తెచ్చిన భవంతర్ యోజన మాదిరి పథకాన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఎంఎస్పీ లభించకపోయినా, పండిన పంట అమ్ముడుకాకపోయినా రైతులకు ఈ పథకం ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తున్నది. నీతి ఆయోగ్ సైతం మార్కెట్లో కొన్ని పంటలకు కనీస మద్దతు ధర కంటే తక్కువ గిట్టుబాటైతే రైతులకు పరిహారం అందించే విధానం ఒకటి ఉండాలని కేంద్రానికి సూచిస్తున్నది.

గతేడాది అక్టోబర్లో భవంతర్ యోజన ప్రారంభించిన చౌహాన్
భవంతర్ యోజన అమలు తీరు తెన్నులపై మధ్యప్రదేశ్ సీఎం శివ్రాజ్ సింగ్ చౌహాన్తోనూ నీతి ఆయోగ్ సంప్రదింపులు జరుపుతున్నది. ఈ పథకంపై ప్రధాని మోదీకి చౌహాన్ సమగ్ర వివరణ కూడా ఇచ్చారు. కనీస మద్దతు ధరతోపాటు పంట నష్ట పరిహారం కోసం రైతులు ఆందోళన బాట పట్టడంతో నిరుడు అక్టోబర్ 11న భవంతర్ యోజనను చౌహాన్ ప్రారంభించారు. తెలంగాణసహా పలు రాష్ట్రాలూ ఈ పథకంపై ఆసక్తి కనబరుస్తుండగా, ఇప్పటికే చత్తీస్గఢ్, మహారాష్ట్ర అధికారులు మధ్యప్రదేశ్లో పర్యటించి పథకం అమలు, దాని ప్రభావం గురించి తెలుసుకున్నారు. ఈ పథకం కింద రైతుల ఖాతాల్లోకే నేరుగా నగదు బదిలీ అవుతుంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సూచించిన ధరలు, మధ్యప్రదేశ్తోపాటు సమీప రాష్ట్రాల హోల్సేల్ మార్కెట్ ధరల ఆధారంగా పరిహారం చెల్లిస్తారు. కాగా, ఈ పథకాన్ని వరితోపాటు 8 పంటలతోపాటు ఉల్లి, పప్పులు, సజ్జలకూ వర్తింపజేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తున్నది.

2006లో ఉపసంహరించిన స్టాండర్డ్ డిడక్షన్
రాబోయే బడ్జెట్లో మళ్లీ స్టాండర్డ్ డిడక్షన్ను అమల్లోకి తీసుకురావాలని వేతన జీవులు కోరుతున్నారు. వేతన జీవుల ప్రయోజనార్థం 1974-75లో పరిచయమైన స్టాండర్డ్ డిడక్షన్ను 2006లో ఉపసంహరించారు. ఉద్యోగులు తమ సంపాదనలో భాగమైన ఖర్చులను తిరిగి క్లయిమ్ చేసుకునేందుకు (పొందేందుకు) ఇది ఉపయోగపడేది. అయితే కనీస మినహాయింపు పరిమితి, 80సీలతో చేకూరుతున్న ప్రయోజనాల దృష్ట్యానే స్టాండర్డ్ డిడక్షన్ను వెనక్కి తీసుకున్నది. కాగా, స్టాండర్డ్ డిడక్షన్ విధానంలో రూ.5 లక్షల వరకు ఉన్న వేతనాలపై ఒకే రకంగా రూ.30,000 వరకు, ఆపై వేతనాలకు రూ.20,000 వరకు క్లయిమ్ చేసుకునే సౌకర్యం ఉండేది.












Click it and Unblock the Notifications