ఢిల్లీలో నానాటికీ పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో పరిస్ధితిని అదుపులోకి తెచ్చేందుకు కేజ్రివాల్ సర్కారు ఆరు రోజుల పాటు పూర్తి కర్ఫ్యూ విధించింది. దాదాపు లాక్డౌన్ తరహాలోనే ఉన్న ఈ కర్ప్యూ కారణంగా అక్కడ జన జీవితం తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇప్పటికే ఢిల్లీకి వీఐపీల రాక తగ్గిపోగా... స్ధానిక ప్రజలూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. వలస కార్మికులు మాత్రం స్వస్ధలాలకు పయనమవుతున్నారు.
ఢిల్లీలో గతేడాది విధించిన లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడిన వలస కార్మికులు ఇప్పుడు విధించిన ఆరు రోజుల కర్ప్యూను కూడా లాక్డౌన్గానే భావిస్తున్నారు. అయితే రవాణా సదుపాయాలు అందుబాటులో ఉండటంతో సాధ్యమైనంత త్వరగా స్వస్ధలాలకు పయనమవుతున్నారు. పూర్తి లాక్డౌన్ విధిస్తే ఇక తాము ఇళ్లకూ వెళ్లలేక ఢిల్లీలో ఉండలేక ఇబ్బందులు పడాలని వారు భయపడుతున్నారు. దీంతో ఢిల్లీ ఆనంద్ విహార్లోని బస్ టెర్మినల్ రద్దీగా మారిపోయింది.