50 రోజులైనా ఖమేనీ అంత్యక్రియలు చేయని ఇరాన్.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు..!
పశ్చిమాసియాలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్, అమెరికా బృందాల మధ్య తొలిసారిగా చర్చలు జరిగాయి. కానీ అవి ఫలించలేదు. ఇప్పుడు మరోసారి ఈ రెండు దేశాలు పాకిస్థాన్ వేదికగా చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా వెల్లడించారు. ఏప్రిల్ 20 సోమవారం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్ తో అమెరికా ప్రతినిధులు చర్చలు జరుపుతారని తెలిపారు.
ఇక ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు దాడులు ప్రారంభించి దాదాపు 60 రోజులు కావొస్తుంది. ఇరాన్ పై అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 28 న ఆయన ఇంటిపై జరిపిన దాడుల్లో ఖమేనీతోపాటు ఆయన కుటుంబంలోని అనేకమంది హతం అయ్యారు. దాంతో 36 ఏళ్లపాటు ఇరాన్ సుప్రీం లీడర్ గా ఆధిపత్యం చెలాయించిన ఖమేనీ స్టోరీ ముగిసినట్లు అయింది.
అయితే ఖమేనీ చనిపోయి ఇప్పటికి దాదాపు 50 రోజులు కావొస్తున్నా ఆయన శవాన్ని ఇరాన్ ప్రభుత్వం ఇంకా పూడ్చి పెట్టలేదని సమాచారం. అయితే దీనికి గల కారణాలు.. భద్రతా పరమైన అడ్డంకులు, లాజిస్టిక్స్ సవాళ్లు అని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.
దేశ సుప్రీం లీడర్ అంత్యక్రియలు కావడంతో లక్షలాది మంది ప్రజలు ఈ సంతాప కార్యక్రమంలో పాల్గొంటారు. దాంతో వాళ్లపై ఇజ్రాయెల్ దాడులు చేసే ప్రమాదం ఉందని.. అందువల్లనే ఖమేనీ అంత్యక్రియలు ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. సాధారణంగా ముస్లిం ఆచారాల ప్రకారం.. ఏ వ్యక్తి అయినా చనిపోయిన వెంటనే అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ ఖమేనీ విషయంలో అది జరగకపోవడం గమనార్హం.
మరో వాదన కూడా ఉంది. అదేంటంటే.. ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వంపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఈ సమయంలో ఖమేనీ అంత్యక్రియలు నిర్వహిస్తే ప్రజలు నిరసనలు వెల్లువెత్తే ప్రమాదం ఉందని ఇరాన్ అధికారులు భావిస్తున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

అయితే ఒకవేళ ఖమేనీ అంత్యక్రియలు నిర్వహిస్తే.. ఆయన స్వస్థలమైన మషద్ లో ఈ కార్యక్రమం ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. మషద్ లోని పవిత్రమైన ఇమాజ్ రెజా మందిరం సమీపంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఇటీవల భారీగా బలగాలను మోహరించింది ఇరాన్ ప్రభుత్వం. దాంతో ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాకిస్థాన్ వేదికగా ఇరాన్- అమెరికా మధ్య రెండో దశ శాంతి చర్చలు ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి.












Click it and Unblock the Notifications