తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇకపై వారికి కూడా పెన్షన్లు..
తెలంగాణలోని భవన నిర్మాణ రంగం సహా అన్ని రంగాల కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. అందుకు తగినట్టుగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 19 ఆదివారం సిద్దిపేటలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ పలు కీలక హామీలు ఇచ్చారు.
రాష్ట్రంలోని భవన నిర్మాణ రంగ కార్మికులను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. వారి పెన్షన్ల అంశంపై ఈ మేరకు మంత్రి వివేక్ వెంకటస్వామి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వీరికి పింఛన్లు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాక రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కార్మిక సంఘాల కోసం ప్రత్యేక భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి మా నాన్న కాక వెంకటస్వామి తీవ్రంగా కృషి చేశారని.. అప్పట్లో పీవీ నరసింహారావుతో కొట్లాడి సింగరేణి భూముల రక్షణ, కార్మికుల పెన్షన్లకు కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు.
కాకా వెంకటస్వామి మార్గంలోనే కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోని హమాలీల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు. అంతేకాక త్వరలోనే లేబర్ బోర్డును పూర్తిగా పునరుద్ధరిస్తామని.. ఆపై లేబర్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు, ప్రమాద బీమాతోపాటుగా ఇతర సంక్షేమ పథకాలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

ఇక కార్మికులకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ను రూ. 10 లక్షలకు పెంచినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి గుర్తు చేశారు. గిగ్ వర్కర్ల భద్రత కోసం గిగ్ వర్కర్స్ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. జర్మనీ పర్యటనలో భాగంగా కార్మికులకు విదేశాల్లో ఉద్యోగాల కల్పనకు రూ.90 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఈ మేరకు భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ల విషయంపై త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications