విజయ్కి డీఎంకే మద్దతు? బీజేపీ ప్లాన్ కు చెక్ పెట్టేలా..!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుచిత జోక్యం చేసుకుంటుందని ఆరోపిస్తున్న డీఎంకే (DMK).. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) కు మద్దతు ప్రకటించింది. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇవాళ రెండోసారి కూడా విజయ్ ప్లాన్ ను గవర్నర్ తిరస్కరించిన నేపథ్యంలో డీఎంకే వైఖరి ప్రాధాన్యం సంతరించుకుంది.
తొలుత అతిపెద్ద పార్టీకే అవకాశం: డీఎంకే డిమాండ్
ఎన్నికల అనంతర పొత్తుల కంటే, ముందుగా అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఆహ్వానించాలని డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నాదురై డిమాండ్ చేశారు. ఏఎన్ఐతో మాట్లాడుతూ, "ఎన్నికలకు ముందు ఏ కూటమికి మెజారిటీ రాని పక్షంలో, చట్టబద్ధ సంప్రదాయాల ప్రకారం, గవర్నర్ ముందుగా అతిపెద్ద పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలి. ఆ తర్వాతే మెజారిటీ నిరూపించుకోమనాలి. ఇదే ప్రజాస్వామ్య సూత్రం" అని ఆయన స్పష్టం చేశారు. "ఎన్నికల పూర్వ కూటమికి మెజారిటీ లేకపోతే, గవర్నర్ టీవీకేను సంప్రదించాలి. వారు మెజారిటీ నిరూపించలేని పక్షంలోనే ఇతర పార్టీలు లేదా ఎన్నికల అనంతర కూటములను పరిగణనలోకి తీసుకోవాలి. తదనంతర కూటములు చివరి ఎంపికగా మాత్రమే ఉంటాయి" అని అన్నాదురై వివరించారు.

కేంద్ర ప్రభుత్వ జోక్యం, డీఎంకే వైఖరి
తమిళనాడులో ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ లేని పరిస్థితుల్లో, దీనిని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేసే అవకాశం ఉందని డీఎంకే అనుమానిస్తోంది. అందుకే, కొత్త పార్టీ అయినా ప్రజల మద్దతు పొందిన అతిపెద్ద పార్టీగా విజయ్ టీవీకేకు డీఎంకే నైతిక మద్దతు ఇస్తున్నట్లు భావిస్తున్నారు. అన్నాదురై దీనిపై మాట్లాడుతూ, “తమిళనాడులో ప్రస్తుతం ఏ కూటమికి మెజారిటీ లేదు. వేరొకరు ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రాలేదు. అయితే, విజయ్ నాయకత్వంలోని టీవీకే, అతిపెద్ద పార్టీగా, 112 మంది ఎమ్మెల్యేల మద్దతుతో గవర్నర్ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు హక్కు కోరారు” అని తెలిపారు. ఇప్పటికే విజయ్ పార్టీ టీవీకే విషయంలో ఆరు నెలలు వేచి చూస్తామని ప్రకటించిన స్టాలిన్.. అవసరమైతే ప్రభుత్వానికి మద్దతు కూడా ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు.
విజయ్ కు గవర్నర్ మళ్లీ తిరస్కారం
ఇదిలా ఉండగా, టీవీకే అధ్యక్షుడు విజయ్ చెన్నైలోని గిండిలో ఉన్న రాజ్భవన్కు వచ్చి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను రెండోసారి కలిశారు. తన పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల మద్దతు లేఖలను ఆయన సమర్పించారు. అయితే రెండోసారి కూడా గవర్నర్ విజయ్ ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో విజయ్ న్యాయనిపుణుల్ని సంప్రదించే పనిలో బిజీగా ఉన్నారు . అయితే విజయ్ విషయంలో డీఎంకే మరింత దూకుడుగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాజకీయ పరిశీలకుల విశ్లేషణ
డీఎంకే వైఖరిని రాజకీయ విశ్లేషకులు నిశితంగా పరిశీలిస్తున్నారు. “ఇది కేవలం ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడే ప్రయత్నం మాత్రమే కాదు; రాష్ట్రంలో కేంద్ర బీజేపీ ప్రభావాన్ని అడ్డుకోవడానికి డీఎంకే చేపట్టిన రాజనీతిజ్ఞ చర్య కూడా” అని వారు అంచనా వేస్తున్నారు. చివరగా, తదుపరి ముఖ్యమంత్రి ఎవరు, టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, లేక గవర్నర్ నిర్ణయం భిన్నంగా ఉంటుందా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ప్రస్తుతం మొత్తం తమిళనాడు దృష్టి గిండిలోని గవర్నర్ నివాసంపైనే ఉంది.












Click it and Unblock the Notifications