ట్రంప్- జిన్ పింగ్ భేటీ.. ఇరాన్ యుద్ధానికి ఫుల్ స్టాప్..?
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేసిన విషయం తెలిసిందే. దాంతో ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లాయి. అటు అమెరికా, ఇరాన్ సైతం యుద్ధం కారణంగా బాగా నష్ట పోయాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. చైనా పర్యటన చేపట్టారు. తాజాగా ట్రంప్.. చైనా చేరుకున్నారు. వాణిజ్యం, ఇరాన్ యుద్ధం, తైవాన్ కు ఆయుధాల విక్రయం వంటి అంశాలపై ట్రంప్.. జిన్ పింగ్ తో చర్చించనున్నారు.
ప్రస్తుతం పశ్చిమాసియాలో ఇరాన్ కేంద్రంగా జరుగుతున్న ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు చైనా తన ప్రభావాన్ని ఉపయోగించాలని ట్రంప్ కోరుతున్నారు. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి గుండా చమురు రవాణా పునరుద్ధరణపై చర్చించనున్నారు. ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ రక్షణ రంగాల్లో వాడే అరుదైన ఖనిజాల సరఫరాపై ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా వీటి ఎగుమతులపై విధిస్తున్న ఆంక్షల్ని సడలించే అవకాశం ఉంది.

మరోవైపు అమెరికా వస్తువులపై చైనా విధిస్తున్న పన్నులు.. అలగే చైనా కంపెనీలపై అమెరికా ఆంక్షల విషయంలో ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇక ఈ పర్యటనకు ముందే అమెరికా కు చైనా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. తైవాన్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదని హెచ్చరించింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్ల తయారీలో పరస్పర సహకారం పైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సమావేశం రెండు దేశాలకే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, భద్రతకు అత్యంత కీలకంగా చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications