రైతు భీమా బంద్ - మారిన ప్రభుత్వ నిర్ణయం...!!
రైతు భీమా పథకం ఆగిపోయినట్లేనా. రైతులకు విపత్కర పరిస్థితుల్లో అందుతున్న రూ 5 లక్షల భీమా పథకం రెన్యువల్ కాలేదు. ప్రభుత్వం ప్రీమియం చెల్లింపులు నిలిపివేసింది. దీంతో ఇక ఆ పథకం నిలిచిపోయినట్లేనని తెలుస్తోంది. ఈ స్థానంలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం రైతులకు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం ఇంకా అమల్లోకి రాలేదు. దీంతో... రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం రైతు భీమా పథకం దాదాపు నిలిపివేసినట్లే కనిపిస్తోంది. పట్టాదారులైన రైతులు సహజంగా మరణించినా, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినా బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా మొత్తం చెల్లిస్తున్నారు. కాగా, ఆగస్టు 14వ తేదీన బీమా రెన్యువల్ కావాల్సి ఉండగా.. ప్రభుత్వం ప్రీమియం చెల్లింపులు నిలిపివేసింది. దీంతో.. ఇక ఈ పథకం నిలిపివేసినట్లు అర్దం అవుతోంది. రాష్ట్రంలో రైతు బీమా పథకం ఎనిమిదేళ్లుగా అమలవుతోంది. ఏటా ఆగస్టు 14వ తేదీన రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తోంది. ఎల్ఐసీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. 18-59 ఏళ్ల వయసున్న రైతులు సహజ మరణం చెందినా, ప్రమాదవశాత్తు చనిపోయినా రైతు కుటుంబానికి రూ.5 లక్షలు చెల్లిస్తున్నారు. ఈ పథకంలో 42.16 లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారు. ఏటా సగటున రూ.1400 కోట్ల ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది.

ప్రభుత్వం తాజా ఆలోచన
కాగా, 2026-27 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించలేదు. పథకం ప్రారంభం నుంచి అనేక కారణాలతో మరణించిన రైతులకు రూ 5 లక్షల చొప్పున రైతుబీమా ఆర్థిక సాయం లభించింది. అయితే, ప్రభుత్వం రైతు భీమా స్థానంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా బీమా సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే సరికొత్త బీమా పథకాన్ని అమలు చేస్తామని గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించింది. 2026-27 వార్షిక బడ్జెట్లో రూ.4 వేల కోట్ల నిధుల కేటాయింపులు జరిపింది. ఈ ఏడాది జూన్ రెండో తేదీ నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నప్పటికీ.. ప్రారంభం కాలేదు. తాజాగా నవంబర్ 19 నుంచి ఈ పథకం ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే, ఇది అమలు కావటానికి ఇంకా 3 నెలల వ్యవధి ఉన్నందున.. ఈ మధ్య కాలంలో మరణించే రైతుల కుటుంబాల పరిస్థితి ఏమిటనే అందోళన కనిపిస్తోంది. రైతు భీమా నిలిచిపోవటం పైన ప్రభుత్వం అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.












Click it and Unblock the Notifications