అక్కడ జస్ట్ ఒక్క ఓటు తేడాతో టీవీకే గెలిచింది
తమిళనాడులో సంచలన విజయం సాధించింది.. తమిళగ వెట్రి కజగం (టీవీకే). 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 108 స్థానాల్లో జెండా ఎగురవేసింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఏఐఏడీఎంకే- 73, డీఎంకే- 53 స్థానాలకు పరిమితం అయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ కు 10 సీట్ల దూరంలో నిలిచారు విజయ్. కాంగ్రెస్ మద్దతును తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఈ ఎన్నికల్లో సహకార శాఖ మంత్రి కేఆర్ పెరియకరుప్పన్ ఓటమి చర్చనీయాంశమైంది. డీఎంకే అభ్యర్థిగా తిరుపత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక్కడ టీవీకే విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన శ్రీనివాస సేతుపతి గెలిచారు. గెలుపోటములను డిసైడ్ చేసిన ఈ ఒక్క ఓటు అంతరం.. తమిళనాడు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది.

పెరియకరుప్పన్ కు మొత్తం 83,374 ఓట్లు పడ్డాయి. ఆయన సమీప ప్రత్యర్థి, టీవీకే అభ్యర్థి ఆర్ శ్రీనివాస సేతుపతికి 83,375 ఓట్ల పోల్ అయ్యాయి. ఒకే ఒక్క ఓటు తేడా ఓ అభ్యర్థి రాజకీయ భవిష్యత్తును తారుమారు చేసింది. రౌండ్ రౌండ్ కూ అత్యంత ఉత్కంఠభరితంగా సాగిందిక్కడ కౌంటింగ్. చివరి రౌండ్ వరకూ ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చింది. చివరికి శ్రీనివాస సేతుపతి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు.
తిరుపత్తూర్ నియోజకవర్గం.. పెరియకరుప్పన్ కు కంచుకోట. వరుసగా నాలుగుసార్లు విజయం సాధించారు. డీఎంకే అభ్యర్థిగా 2006, 2011, 2016, 2021 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో ఇక్కడ ఏఐఏడీఎంకే పోటీ చేయలేదు. బీజేపీకి ఈ సీటును కేటాయించింది. బీజేపీ నుంచి కేసీ తిరుమారన్ బరిలో నిలిచారు. టీవీకే తరఫున శ్రీనివాస సేతుపతి పోటీ చేశారు. పెరియకరుప్పన్ ఓక్క ఓటు తేడాతో ఓడిపోగా.. తిరుమారన్ కు మూడో స్థానం దక్కింది.












Click it and Unblock the Notifications