అర్ధరాత్రి పాక్ బలగాల క్రూరత్వం. బిడ్డ తల్లిని కూడా వదలకుండా..
పాకిస్థాన్లో బలూచ్ పౌరుల అదృశ్యాలు మరోసారి అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తూ సాగుతున్న ఈ 'అజ్ఞాత నిర్బంధాలు' ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. తాజాగా కరాచీ నగరంలో అర్ధరాత్రి వేళ ఓ గృహిణి కిడ్నాప్కు గురైన ఉదంతం బలూచిస్తాన్ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారి తీస్తోంది.
కరాచీలోని నావల్ ఏరియాలో నివసిస్తున్న హసీనా బలూచ్ అనే మహిళను పాకిస్థాన్ బలగాలు బలవంతంగా తీసుకెళ్లినట్లు 'ది బలూచిస్తాన్ పోస్ట్' వెల్లడించింది. ఒక బిడ్డకు తల్లి, సాదాసీదా గృహిణి అయిన హసీనాను అర్ధరాత్రి వేళ ఆమె నివాసం నుంచే గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. అప్పటి నుంచి ఆమె ఎక్కడ ఉంది? ఏ స్థితిలో ఉంది? అనే సమాచారం కుటుంబ సభ్యులకు కానీ, బయటి ప్రపంచానికి కానీ తెలియకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం ఒక వ్యక్తిగత కిడ్నాప్ కాదని, బలూచ్ జాతిని భయభ్రాంతులకు గురిచేసే ఒక పక్కా వ్యూహమని హక్కుల నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇది ఒక క్రూరమైన పాలసీ..
బలూచ్ యాక్జెహ్తీ కమిటీ (BYC) ప్రముఖ నేత డాక్టర్ సబీహా బలూచ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. బలూచ్ మహిళల అదృశ్యం అనేది ఇప్పుడు ఒక వివిక్త సంఘటన కాదని, అదొక "వ్యవస్థీకృత విధానం" (Deliberate Policy) గా మారిందని ఆమె ఆరోపించారు. బలూచ్ పోరాటాన్ని అణచివేయడానికి మహిళలను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం, వారిని భయపెట్టడం పాకిస్థాన్ బలగాలకు పరిపాటిగా మారిందని ఆమె మండిపడ్డారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇవి మానవత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలని ఆమె గుర్తు చేశారు.
కుటుంబాల ఆర్తనాదాలు.. నిశబ్దంలో న్యాయం!
బలూచ్ ఉమెన్ ఫోరమ్ (BWF) కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా, చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించకుండా మహిళలను ఇలా మాయం చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని వారు వాపోయారు. హసీనా అదృశ్యంతో ఆమె కుటుంబం తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తోంది. తమ బిడ్డ క్షేమంగా తిరిగి వస్తుందా లేదా అన్న సందిగ్ధంలో వారు గడుపుతున్నారు. అధికారుల తీరును తప్పుబడుతూ, హసీనాను తక్షణమే విడుదల చేయాలని బలూచ్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రపంచం దృష్టికి బలూచ్ ఆవేదన..
బలూచిస్తాన్లో జరుగుతున్న ఈ మానవ హక్కుల ఉల్లంఘనలపై పాకిస్థాన్ ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్బాటాలతో తప్పించుకోవాలని చూస్తోందని ఆక్టివిస్టులు ఆరోపిస్తున్నారు. రహస్య నిర్బంధంలో ఉన్న వ్యక్తుల నుంచి తీసుకునే వాంగ్మూలాలకు ఎటువంటి చట్టబద్ధత ఉండదని, అవి కేవలం హింసతో రాబట్టినవని డాక్టర్ సబీహా స్పష్టం చేశారు. హసీనా బలూచ్ ఎక్కడ ఉందో బహిరంగ పరచాలని, ఆమెకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని బలూచ్ మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
బలూచ్ గడ్డపై సాగుతున్న ఈ అదృశ్యాల పర్వం ఎప్పుడు ఆగుతుందో? ఈ చీకటి గదుల వెనుక బందీలుగా ఉన్న ప్రాణాలకు విముక్తి ఎప్పుడు లభిస్తుందో అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.












Click it and Unblock the Notifications