నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా.. సింహగర్జనతో మొదలైన సమర శంఖం!
తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసి, ఒక జాతి ఆకాంక్షను గమ్యానికి చేర్చిన అజేయ శక్తి.. భారత రాష్ట్ర సమితి. 2001 ఏప్రిల్ 27న 'జలదృశ్యం' వేదికగా ఒక చిన్న మొలకగా ప్రారంభమైన ఈ ప్రయాణం, నేడు పాతికేళ్ల మైలురాయిని అధిగమించి మహోజ్వల విప్లవంగా నిలిచింది. పాలకుల ఎత్తుగడలు, రాజకీయ కుతంత్రాలను చిత్తు చేస్తూ కేసీఆర్ నాయకత్వంలో సాగిన ఈ 'లాంగ్ మార్చ్' ఇప్పుడు రజతోత్సవ సంబరాలతో కొత్త ఉత్తేజాన్ని సంతరించుకుంది.
నాడు ఉమ్మడి పాలనలో తెలంగాణ పడుతున్న గోసను చూసి చలించిన కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, తన పదవికి రాజీనామా చేసి కరీంనగర్ 'సింహగర్జన' వేదికగా స్వరాష్ట్ర పోరాటాన్ని ప్రారంభించారు. "పుబ్బలో పుట్టి మఖలో మాయమవుతుంది" అని హేళన చేసిన నాటి పాలకుల కళ్లు తెరిపిస్తూ, గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ జెండాను రెపరెపలాడించారు. 2004లో వ్యూహాత్మక పొత్తులతో తెలంగాణ అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో చేర్పించడం నుంచి, 2009లో ప్రాణాలకు తెగించి చేసిన ఆమరణ నిరాహార దీక్ష దాకా.. కేసీఆర్ చాణక్యం తెలంగాణ కలను నిజం చేసింది.

పోరాటమే కాదు.. పాలనలోనూ మేటి!
2014లో స్వరాష్ట్ర స్వప్నం సాకారమయ్యాక, అధికారం చేపట్టిన బీఆర్ఎస్ తెలంగాణను అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలిపింది. చీకటి నుంచి వెలుగుల వైపు రాష్ట్రాన్ని నడిపించి విద్యుత్ కష్టాలను గట్టెక్కించి 24 గంటల కరెంట్ అందించిన ఘనత ఈ పార్టీదే. సాగునీటి విప్లవంతో కాళేశ్వరం వంటి బృహత్తర ప్రాజెక్టు, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ ద్వారా ఎండిన భూముల్లో పచ్చదనం నింపింది. కల్యాణలక్ష్మి, రైతుబంధు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ సంక్షేమాన్ని చేర్చి తన మార్క్ పాలనను చూపించింది. 200 రూపాయల పింఛన్ను 2,000కు పెంచి నిస్సహాయులకు భరోసా కల్పించింది గులాబీ జెండా.
బూడిద నుంచి ఎగిసే ఫినిక్స్ పక్షిలా..
రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా, 2023 ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పని అయిపోయిందని విమర్శించిన వారికి ఈ పార్టీ తన పోరాట పటిమతో సమాధానం చెబుతోంది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి నాయకులు ప్రజాక్షేత్రంలో అలుపెరుగని పోరు సాగిస్తున్నారు. అక్రమాలను ప్రశ్నిస్తూ, సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ మళ్లీ ప్రజల్లోకి వెళ్తోంది. "బీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు.. అది ఒక జాతి ఆత్మగౌరవ ప్రతీక" అని పార్టీ శ్రేణులు సగర్వంగా చాటుతున్నాయి.
ఎత్తిన జెండాను దించకుండా
పట్టుదల, నిబద్ధతతో ప్రయాణం చేసి
ఎన్నో కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొని
గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమ వీరుడు కేసీఆర్!
దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటాలను గమ్యానికి చేర్చిన
తెలంగాణ అస్థిత్వం బీఆర్ఎస్.పార్టీ శ్రేణులకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు - BRS
కేటీఆర్ ఎమోషనల్ పోస్ట్..
నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా...
పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న పునరంకిత సందర్భం!
స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ ..
సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకును జరుపుకుంటున్న సన్నివేశం!
25 వసంతాల మైలురాయిని అధిగమించిన
మహోజ్వల లాంగ్ మార్చ్!
బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు ...ఒక విప్లవం!
పార్టీ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు, అభిమానులకు, నాయకులకు, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
జై తెలంగాణ - KTR
నేడే తెలంగాణ భవన్లో కేసీఆర్ రణగర్జన!
నేడు 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామగ్రామాన గులాబీ జెండాలు రెపరెపలాడనున్నాయి. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. సుమారు 305 మంది కీలక నేతలు హాజరయ్యే ఈ సభలో.. రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణ, పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలు మరియు ప్రజా సమస్యలపై పోరాడే దిశగా కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.












Click it and Unblock the Notifications