హైదరాబాద్ మెట్రో 2, 3 ఫేజ్ లపై సీఎం రేవంత్ రెడ్డి దూకుడు.. కేంద్రానికి విజ్ఞప్తి!
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో విస్తరణ పనులపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతోంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యి హైదరాబాద్ మెట్రో ఫేస్ టు నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) ఇప్పటికే కేంద్రానికి సమర్పించిన నేపథ్యంలో, దానికి త్వరగా సాంకేతిక మరియు ఆర్థిక ఆమోదం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రిని కోరారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తూ సుమారు 122.9 కిలోమీటర్ల పొడవునా విస్తరించే ఫేజ్-2 ప్రాజెక్టు , అన్ని ప్రముఖ ప్రాంతాలకు అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని సీఎం స్పష్టం చేశారు.

ఫేజ్-2, ఫేజ్-3 పనులు మరింత వేగంగా చెయ్యాలంటే సహకారం కావాలన్న సీఎం
గతంలో ఎల్ అండ్ టీ చేతుల్లో ఉన్న మెట్రో ఫేజ్-1ని రాష్ట్రప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుందని సీఎం గుర్తు చేశారు. దీంతో ఫేజ్-2, ఫేజ్-3 పనులు మరింత వేగంగా, ఆటంకాలు లేకుండా పూర్తి చేయవచ్చన్నారు. అందుకు కేంద్ర సహకారం కావాలని ఆయన కోరారు. ప్రభుత్వ నియంత్రణలో మెట్రో నెట్వర్క్ అంతా ఒకే గొడుగు కిందకు వచ్చి, ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించటానికి పాటుపడే అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
50:50 ఖర్చు పంచుకోవాలని ప్రతిపాదన
ఫేజ్-2లోని ఏడు కారిడార్ల నిర్మాణం కోసం అంచనా వేసిన రూ.38,595 కోట్లను కేంద్రం, రాష్ట్రం 50:50 నిష్పత్తిలో భాగస్వామ్యంతో భరించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. ఫేజ్-3 లో ఎయిర్పోర్ట్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో లైనును ఫేజ్-3లో చేపట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన DPR కూడా సిద్ధంగా ఉందని తెలియజేశారు.
మెట్రో విస్తరణతో రాష్ట్ర ఆర్ధిక వృద్ధి
మెట్రో విస్తరణ ద్వారా ఎయిర్పోర్ట్, ఐటీ కారిడార్, పాతబస్తీ, ఫ్యూచర్ సిటీ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడి, రాష్ట్ర ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని అధికారులు వివరించారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.













Click it and Unblock the Notifications