"సింగపూర్, టోక్యో, న్యూయార్క్ లా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి"
సింగపూర్, టోక్యో, న్యూయార్క్ లా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మనందరం కలిస్తేనే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేట్ లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పోలీస్ కమిషనరేట్ భవనంతోపాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు.
"మనందరం కలిస్తేనే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సాధ్యమవుతుంది. తమ గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీలో కలపాలని కొంతమంది నా దగ్గరకు వచ్చి విజ్ఞప్తి చేశారు. గ్రామసభలు నిర్వహించి తీర్మానం చేయించి ఆ గ్రామాలను వారి కోరిక మేరకు కమిషనరేట్ పరిధిలోకి తీసుకువచ్చేలా చూడాలని స్థానిక నాయకులను ఆదేశిస్తున్నా. భారత్ ఫ్యూచర్ సిటీని అద్భుతమైన నగరంగా అభివృద్ధి చేసుకుందాం. సింగపూర్, టోక్యో, న్యూయార్క్ లా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
"త్వరలోనే జూన్ 2 లోగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించుకుందాం. ఇక నుంచి ఇక్కడి నుంచే సమీక్షలు నిర్వహించి పెట్టుబడులను ఆహ్వానిద్దాం. ఆనాడు ఔటర్ రింగురోడ్డు నిర్మించేటప్పుడు ఇది అయ్యేది కాదని చాలామంది అనుకున్నారు. 160.500 కి.మీ ఔటర్ రింగు రోడ్డు దేశంలో ఏ నగరానికి లేదు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా నష్టపోతున్న రైతులనుప్రభుత్వం ఆదుకుంటుంది. మా ప్రభుత్వం ఎవరికీ నష్టం కలగనీయదు. మీ సమస్య పరిష్కారానికి మా మంత్రి శ్రీధర్ బాబు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు" అని తెలిపారు.
పేదల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు సూచిస్తున్నా.. మీరు సహకరిస్తే దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అద్భుతమైన నగర నిర్మాణానికి వేగంగా అడుగులు పడతాయి. ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వారైనా ఇక్కడకు వచ్చి పెట్టుబడులు పెట్టేలా ఫ్యూచర్ సిటీని తీరిదిద్దుతాం. దేశంలో ఏడు బుల్లెట్ ట్రైన్స్ మంజూరు చేస్తే మూడు బుల్లెట్ ట్రైన్స్ మన రాష్ట్రానికే వచ్చాయి. బెంగుళూరు- హైదరాబాద్ , శంషాబాద్- పూనే, శంషాబాద్- అమరావతి- చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ కు మార్గం సుగమమైంది. రంగారెడ్డి జిల్లాలో అద్భుతం జరగబోతుంది. అందరూ సహకరిస్తేనే అభివృద్ధి ఆ అద్భుతం ఆవిష్కృతమవుతుంది. నాపై నమ్మకం ఉంచండి. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది.. అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మేం అభివృద్ధి చేస్తామంటే కొందరు ఏడుపులు మొదలు పెట్టారు. మీరు ఏడుస్తూనే ఉండండి.. మేం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళతాం. రాక్షసుల కుల గురువు శుక్రాచార్యుడు. దేవతలు యజ్ఞాలు చేస్తుంటే శుక్రాచార్యుడు మారీచుడు, సుబాహుడును పంపి భగ్నం చేయాలని ప్రయత్నించే వారు. రాష్ట్రంలో కూడా ఫామ్ హౌస్ లో ఉన్న శుక్రాచార్యుడు మన అభివృద్ధి యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు మారీచుడు, సునాహుడిని పంపాడు. రెండు వేసి మాట్లాడే వాళ్ల మాటలను సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు. అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఇవాళ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కు శంకుస్థాపన చేసుకున్నాం..అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ వేదికగా మావోయిస్టులకు పిలుపునిస్తున్నా.. ఇంకా ఎవరైనా మావోయిస్టులు అడవుల్లో మిగిలిపోతే వచ్చి జనజీవన స్రవంతిలో కలవండి. మీ ఆరోగ్యం, మీకు భరోసా కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.. అని తెలిపారు.












Click it and Unblock the Notifications