KCR: చంద్రబాబుతో పొత్తు వెనుక అసలు రహస్యం అదే..
సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తన మార్క్ రాజకీయ విశ్లేషణతో విరుచుకుపడ్డారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అటు పొరుగు రాష్ట్ర రాజకీయాలను, ఇటు కేంద్రంలోని బీజేపీ తీరును, రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనను ఎండగట్టారు. తెలంగాణ ప్రయోజనాల కోసం తానేనాడు రాజీ పడలేదని, భవిష్యత్తులోనూ ఒక రక్షణ కవచంలా పోరాడుతానని స్పష్టం చేశారు.
గత రాజకీయ పరిణామాలపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2009లో తెలుగుదేశం పార్టీతో తాము పొత్తు పెట్టుకోవడం వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం ఉందని వెల్లడించారు. అప్పటి వరకు సమైక్య వాదాన్ని వినిపిస్తున్న చంద్రబాబు నాయుడు నోటి వెంట 'జై తెలంగాణ' అనిపించడమే లక్ష్యంగా తాము ఆనాడు అడుగులు వేశామని చెప్పారు. ఆనాడు తాము వేసిన వ్యూహాత్మక అడుగు వల్లే తెలంగాణ ఉద్యమం మరో మలుపు తిరిగిందని ఆయన గుర్తుచేశారు.

హైదరాబాద్ కోసం సోనియాతో పోరాటం!
తెలంగాణ ఏర్పాటు సమయంలో ఎదురైన ఒత్తిడిని కేసీఆర్ ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం విషయంలో రాజీ పడాలని అప్పటి యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా 16 సార్లు కోరారని సంచలన విషయం వెల్లడించారు. "హైదరాబాద్ లేని తెలంగాణ మొండెం లేని శరీరం లాంటిదని భావించాను. అందుకే అంగుళం కూడా వెనక్కి తగ్గకుండా పోరాడి హైదరాబాద్తో కూడిన తెలంగాణను సాధించుకున్నాను" అని ఆయన ఆవేశంగా చెప్పారు.
రైతు బంధు 'గుట్టు'.. నేటి 'బొందల పడ్డ' బతుకులు!
ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ నిపుణుడు అశోక్ గులాటీ ఇచ్చిన విలువైన సలహా మేరకే తాను 'రైతు బంధు' పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కేసీఆర్ తెలిపారు. అయితే నేడు రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి పండిన ధాన్యం కొనడం కూడా చేతకావడం లేదని, ప్రజల పరిస్థితి "బొందల పడ్డట్టు" తయారైందని వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగం కుప్పకూలుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ఇది 'చిల్లర' ప్రభుత్వం.. బీజేపీది 'మనువాద' సిద్ధాంతం!
ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రాల వారు హైదరాబాద్లోని భారీ అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి వస్తుంటే, గేట్లు తీయకుండా అడ్డుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని "చండాలమైన, చిల్లర ప్రభుత్వం"గా అభివర్ణించారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థకావటం లేదన్న కేసీఆర్... బొందల పడ్డట్టు అయిందని ప్రజలు ఆవేదన చెందున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో వినిపిస్తున్న భాష, పాలకుల కూతలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని విమర్శించారు. మరోవైపు బీజేపీని 'మనువాద' పార్టీగా పేర్కొన్న ఆయన, ఆ పార్టీలో మహిళలకు గౌరవం ఉండదని ఆరోపించారు. బీజేపీ నేత తేజస్వి సూర్యపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. తెలంగాణ ప్రయోజనాలపై ఇతర రాష్ట్రాల నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా కాంగ్రెస్ మౌనంగా ఉండటం విడ్డూరంగా ఉందన్నారు.
యుద్ధానికి సిద్ధం..
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పాత కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయాల వరకు విద్యార్థి విభాగాలను బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గం నుండి 200 మంది చొప్పున కార్యకర్తలను ఎంపిక చేసి, వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి 'తెలంగాణ వారియర్స్'గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. తెలంగాణకు రక్షణ కవచంలాంటి క్యాడర్.. యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications