తెలంగాణలో జులై 4వరకు ఈ జిల్లాలకు భారీవర్షాల హెచ్చరిక!
తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవటం లేదు. వర్షాభావ పరిస్థితులతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిన్నా మొన్నటివరకు రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించకపోవటంతో వర్షాలు కురవలేదని ఆందోళనలో ఉన్న క్రమంలో, నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించడంతో వాతావరణ శాఖ రాష్ట్రవ్యాప్తంగా వర్ష సంబంధిత హెచ్చరికలు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా జులై 4వ తేదీ వరకు వర్షాలు
తెలంగాణా రాష్ట్రంలో జులై 4వ తేదీ వరకు ఉత్తర తెలంగాణ మరియు తూర్పు తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్ 8న ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించాయి.అయినా ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో విస్తరించి వర్షాలు కురవలేదు. ప్రస్తుతం రుతుపవనాలు బలపడి రాష్ట్రమంతా వ్యాపించాయి. దీంతో రాబోయే రోజుల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ జిల్లాలలో కురిసిన వర్షాలు
గత 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం ఆదిలాబాద్ జిల్లా భరంపూర్ ప్రాంతంలో 9 సెంటీమీటర్లు నమోదైంది. ఇక జగిత్యాల జిల్లా మల్యాలలో 8.6 సెం.మీ, నిజామాబాద్ జిల్లా జానకంపేటలో 8.4 సెం.మీ, నల్గొండ జిల్లా దామరచర్లలో 8.3 సెం.మీ వర్షం కురిసింది. ఇలా అనేక ప్రాంతాల్లో 7-8 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా వర్షాలు నమోదయ్యాయి.
ఈ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం
నేటి నుంచి జులై 4 వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. బుధవారం నాటికి ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఈ కాలంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. జూన్ నెలలో ఎండల తీవ్రత కారణంగా రైతులు ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు రుతుపవనాలు విస్తరించడంతో ఖరీఫ్ సీజన్ పంటల సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. వ్యవసాయ అధికారులు ఈ వర్షాలు పంటల వృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు.
వర్షాల వార్త రైతులకు బిగ్ రిలీఫ్
ముఖ్యంగా ఎల్ నినో ప్రభావంతో ఈసారి తక్కువ వర్షపాతం నమోదవుతుంది అని వాతావరణ శాఖాధికారులు చెప్పారు. ఈ క్రమంలో రైతులు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. ఏది ఏమైనా వర్షాలు పడతాయని తాజా వాతావరణ శాఖ హెచ్చరిక రైతులకు పెద్ద ఉపశమనంగా చెప్పొచ్చు.













Click it and Unblock the Notifications