ఛాట్ జీపీటీతో పరీక్షల్లో చీటింగ్-దొరికిపోయిన 7 వేల మంది విద్యార్ధులు..!
మన జీవితాల్లో అత్యంత వేగంగా దూరిపోతున్న కృత్రిమ మేథ ఇప్పుడు మంచితో పాటు చెడుకీ సాధనంగా మారిపోతోంది. ఏఐ సాయంతో ప్రపంచంలో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో, అన్నే అనర్థాలు కూడా జరిగిపోతున్నాయి. వీటికి మంచి ఉదాహరణగా నిలిచే ఘటన ఒకటి తాజాగా వెలుగుచూసింది. దీని వివరాలు చూస్తే ఏఐ ప్రపంచానికి చేస్తున్న అనర్ధం కూడా అర్దమవుతోంది.
2023-24 విద్య సంవత్సరంలో బ్రిటన్ లోని వివిధ యూనివర్సిటీల్లో ఛాట్ జీపీటీతో మరికొన్ని ఏఐ టూల్స్ ద్వారా చీటింగ్ చేస్తూ ఏకంగా ఏడు వేల మంది విద్యార్ధులు దొరికిపోయారు. ఈ విషయాన్ని బ్రిటన్ కు చెందిన ద గార్డియన్ పత్రిక నివేదించింది. దేశంలోని 155 యూనివర్శిటీలను సంప్రదించేందుకు ప్రయత్నించగా తమకు 131 వర్సిటీలు స్పందించాయని గార్డియన్ తెలిపింది. దీంతో నివ్వెరపోవడం ప్రపంచం వంతయింది.

తాజా గణాంకాల ప్రకారం ప్రతి 1,000 మంది విద్యార్థులకు 5.1 మంది ఏఐ-సంబంధిత మోసానికి పాల్పడిన కేసులు ఎదుర్కుంటున్నట్లు గార్డియన్ తెలిపింది. ఇది గత సంవత్సరం 1,000 మందికి 1.6 నుండి పెరిగింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇలాంటి కేసులు 7.5కు చేరుకోవచ్చనే అంచనాలు వస్తున్నాయి. దీంతో విద్యావ్యవస్థపై ఏఐ చూపిస్తున్న దుష్ప్రభావం అర్దమవుతోంది. ఈ కేసులు కేవలం శాంపిల్ మాత్రమేనని నిపుణులు చెప్తున్నారు.
ప్రస్తుతం చాలా దేశాల్లో విదేశీ యూనివర్సిటీలు విద్య బోధనలో ఏఐ వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే బ్రిటన్ లో ఇలా ఏఐ వాడకం వల్ల ఎదురైన ఫలితాలను బట్టి చూస్తే యూనివర్శిటీలకు పెను సవాళ్లు తప్పేలా లేవు. అదే సమయంలో బ్రిటన్ లో సంప్రదాయ కాపీ కేసులు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications