ఏఐ ఉద్యోగాలు లాక్కోదు..! అసలు పింక్ స్లిప్ అదే-మైక్రోసాఫ్ట్ ఆసియా బాస్..!
ప్రపంచవ్యాప్తంగా ఏఐ దూకుడుతో ఉద్యోగాలు ఆవిరైపోతున్నాయనే ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. ఓసారి డిగ్రీలు చదివేసి ఉద్యోగాలు సంపాదించి ఇన్నాళ్లూ హాయిగా బతికేస్తున్నామని భావిస్తున్న వారంతా ఇప్పుడు ఏఐ, ఆటోమేషన్ దెబ్బకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ దక్షిణాసియా బాస్ ఏఐ, ఉద్యోగాల కోతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐతో ఉద్యోగాలు పోతాయని ఆందోళన చెందుతున్న వారిలో ఇవి దైర్యం నింపేలా ఉన్నాయి.
స్థిరమైన, దీర్ఘకాలిక ఉద్యోగాలు చేస్తున్న చివరి తరం తమదేనని మైక్రోసాఫ్ట్ దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ తెలిపారు. మైక్రోసాఫ్ట్ ముంబైలో నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఏఐపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ తమ ఉద్యోగాలు లాక్కుంటుందని ఉద్యోగులు భావిస్తున్నారని, కానీ అది కేవలం ఉద్యోగాల స్వరూపాన్ని మారుస్తుందని, వాటిని విడదీసి సునాయాసం చేస్తుందని ఆయన విశ్లేషించారు.

ఏఐ కారణంగా జీవితంలో ఒకేసారి చదవుకుని, మిగిలిన జీవితమంతా డబ్బు సంపాదించుకోవచ్చన్న ఈ పారిశ్రామిక యుగం ఆలోచనను ఇది తుంచేస్తుందని పునీత్ చందోక్ తెలిపారు. స్థిరమైన, సుదీర్ఘమైన ఉద్యోగాలు చేస్తున్న చివరి తరం మనదేని అంతా అంగీకరించక తప్పదన్నారు. మన పిల్లలు మాత్రం విభిన్నమైన పనులు చేస్తారని ఆయన జోస్యం చెప్పారు. నిరంతరం నేర్చుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.

ఏఐ రాకతో ప్రస్తుతం కంపెనీల్లో ఉద్యోగులు తమకు పింక్ స్లిప్ ఇస్తారని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో .. అసలైన పింక్ స్లిప్ కు అర్దం ఏంటో చందోక్ వెల్లడించారు. అసలైన పింక్ స్లిప్ ఆటోమేషన్ కాదని, నేర్చుకోవడానికి నిరాకరించడమే అని ఆయన తేల్చిచెప్పేశారు. తద్వారా ప్రస్తుత తరం నేర్చుకునేందుకు ఆసక్తి చూపకపోవడం వల్లే ఉద్యోగ భద్రత కరువవుతుందని ఆయన చెప్పకనే చెప్పారు.












Click it and Unblock the Notifications