పర్యాటక కేంద్రంగా థియేటర్.. విదేశీయులు వస్తే అందులో సినిమా చూసెళ్తారు
సాధారణంగా ఒక సినిమా సూపర్ హిట్ అయితే 100 రోజులు, మహా అయితే ఏడాది పాటు థియేటర్లలో ఆడటం చూస్తుంటాం. కానీ తరాలు మారినా, OTT యుగం వచ్చినా... ఏకంగా మూడు దశాబ్దాలుగా (30 ఏళ్లు) ఒకే థియేటర్లో నిరంతరాయంగా ప్రదర్శించబడుతున్న ఏకైక భారతీయ చిత్రం 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే'. దీన్నే ముద్దుగా అభిమానులు DDLJ అని పిలుచుకుంటారు.
రూ.4 కోట్లకు రూ.100 కోట్లు వచ్చాయి
ఆదిత్య చోప్రా దర్శకత్వంలో 'కింగ్ ఖాన్' షారూఖ్ ఖాన్ - కాజోల్ జంటగా తెరకెక్కిన ఈ ఆల్టైమ్ క్లాసిక్, 1995లో విడుదలయ్యే సమయానికి అయిన ఖర్చు కేవలం రూ. 4 కోట్లు మాత్రమే. అయితే విడుదలైన తర్వాత ఈ సినిమా సృష్టించిన కలెక్షన్ల సునామీకి ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు నమోదయ్యాయి. ఆ కాలంలోనే ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి, ప్రేమికుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.

ఈ సినిమా సాధించిన అత్యంత అరుదైన ఘనత ముంబైలోని ప్రఖ్యాత 'మరాఠా మందిర్' థియేటర్తో ముడిపడి ఉంది. సినిమా విడుదలైన నాటి నుంచి నేటివరకు ప్రతిరోజూ ఉదయం 11:30 గంటలకు ఈ మ్యాటినీ షో క్రమం తప్పకుండా ప్రదర్శించబడుతోంది. ఒకే థియేటర్లో ఇన్ని సంవత్సరాల పాటు ఆగకుండా ఒకే చిత్రం ప్రదర్శించబడటం భారతీయ సినీ చరిత్రలోనే ఒక అపూర్వ ప్రపంచ రికార్డు.
తీసేస్తానంటే అభిమానులు ఒప్పుకోలేదు
నేటి మల్టీప్లెక్స్ యుగంలో టికెట్ ధరలు వందల్లో ఉంటే, మరాఠా మందిర్లో మాత్రం ఇప్పటికీ సామాన్యులకు అందుబాటులోనే ధరలను ఉంచడం విశేషం. ప్రస్తుతం అక్కడ బాల్కనీ టికెట్ ధర రూ. 50 గానూ, జనరల్ సీట్ ధర రూ. 30 గానూ ఉంది. 2015లో ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని థియేటర్ యాజమాన్యం భావించినప్పటికీ, అభిమానుల నుంచి వచ్చిన తీవ్ర నిరసనలతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని షోలను అలాగే కొనసాగించారు. ప్రతిరోజు ఇప్పటికీ మ్యాట్నీ షో డీడీఎల్ జే ను ప్రదర్శిస్తారు. ప్రేమ, భారతీయ కుటుంబ విలువల కలబోతగా వచ్చిన ఈ ఐకానిక్ మూవీ, ప్రస్తుతం ముంబై నగరాన్ని సందర్శించే దేశవిదేశీ పర్యాటకులు కూడా గేట్ వే ఆఫ్ ఇండియాతోపాటు మరాఠా మందిర్ కు వచ్చి ఈ సినిమా కూడా చూడటం అనేది ఒక ప్రత్యేక ఆకర్షణగా మారి భారతీయ సినీ వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.












Click it and Unblock the Notifications