AP SSC Exam Results: ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదల ఎప్పుడంటే ?
ఈ ఏడాది పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమవుతోంది. మార్చి 18 నుంచి 30 వరకూ నిర్వహించిన పదో తరగతి పరీక్షల అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనం, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫలితాల విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆన్ లైన్ లో మార్కుల నమోదు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. అనంతరం ఫలితాల విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఓ ప్రకటన చేసింది.

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను దాదాపు 6.3 లక్షల మందికి పైగా విద్యార్ధులు రాశారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం, దాని పునఃపరిశీలన పూర్తయ్యాయి. దీంతో మార్కులను ఆన్ లైన్ లో నమోదు చేసే కార్యక్రమం జరుగుతోంది. వారం రోజుల్లో ఇది కూడా పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 25 తర్వాత ఏ క్షణమైనా పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల ఉండే అవకాశముంది.
గతేడాది పదో తరగతి పరీక్షల ఫలితాలను మే 6వ తేదీన విడుదల చేశారు. ఈసారి అంతకంటే ముందే ఫలితాల విడుదలకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ నుంచి ఫలితాల విడుదలకు అనుమతి కూడా కోరుతోంది. సాధ్యమైనంత వరకూ వారం రోజుల్లో అనుమతి లభిస్తే వచ్చేవారం చివరిలో ఫలితాల విడుదల ఉండొచ్చని తెలుస్తోంది. అనివార్య పరిస్ధితుల్లో ఆలస్యమైతే మాత్రం మే మొదటి వారంలో ఫలితాలను విడుదల చేసే అవకాశముంది.
ఫలితాలు విడుదల కాగానే విద్యార్ధులు బోర్డు అధికారిక వెబ్ సైట్ https://bse.ap.gov.in/ లోకి వెళ్లి స్కోరు కార్డును యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పిస్తారు.












Click it and Unblock the Notifications