CBSE Advisory: 10, 12 తరగతుల విద్యార్దులకు సీబీఎస్ఈ తాజా అలర్ట్..!
దేశవ్యాప్తంగా ఈ ఏడాది సీబీఎస్ఈ వార్షిక బోర్డు పరీక్షల నిర్వహణకు రంగం సిద్దమవుతోంది. పది, పన్నెండు తరగతుల విద్యార్దులకు ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు సిద్దమైంది.ఇందులో 10, 12 తరగతులకు సంబంధించిన బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభం కానున్నాయి. వీటిలో 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 2 వరకు జరగనుండగా.. 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి మార్చి 13 వరకు జరుగుతాయి.
ఈ నేపథ్యంలో 10, 12 తరగతుల విద్యార్దులను అప్రమత్తం చేస్తూ సీబీఎస్ఈ బోర్డు ఓ హెచ్చరిక (Advisory)విడుదల చేసింది. ఇందులో శాంపిల్ పేపర్లు, తప్పుడు సమాచారంతో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న పలు లింక్స్ పై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు పేర్కొంది. ఇందుకు విద్యార్ధులు కూడా సహకరించాలని కోరింది.

సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలను దృష్టిలో ఉంచుకుని వివిధ వ్యక్తులు, ప్లాట్ఫారమ్ల ద్వారా సర్కులేట్ అవుతున్న పేపర్ లీక్లు, నకిలీ నమూనా పేపర్ లింక్లకు సంబంధించిన పుకార్లను బోర్డు తన హెచ్చరికల్లో ప్రస్తావించింది. యూట్యూబ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వ్యాప్తి చెందుతున్న పుకార్లపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్దులకు సూచించింది.
కొందరు నమూనా పేపర్లకు నకిలీ లింక్లను సర్క్యులేట్ చేస్తున్నారని, వాటి ఆధారంగా ప్రశ్నలు ఉంటాయని నమ్మిస్తున్నారని బోర్డు తెలిపింది. అలాగే ప్రశ్న పత్రాల నకిలీ చిత్రాలు, వీడియోలను కూడా సర్క్యులేట్ చేస్తున్నారని, వీటిని యాక్సెస్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కూడా తెలిపింది. ఇలాంటి బాధ్యతారహిత కార్యకలాపాలు విద్యార్థులు, ప్రజలలో గందరగోళం, భయాందోళనలను సృష్టిస్తాయని బోర్డు ప్రకటనలో పేర్కొంది. వీటిపై బోర్డు తరఫున చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.












Click it and Unblock the Notifications