CBSE Exams 2024: 10, 12 క్లాసుల విద్యార్ధులకు ఓవైపు ప్రాక్టికల్స్-మరోవైపు సైకలాజికల్ కౌన్సెలింగ్..
ఈ ఏడాది సీబీఎస్ఈ పది, పన్నెండు తరగతుల బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులను మానసికంగా సన్నద్ధం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి నుంచి వీరికి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మరోవైపు విద్యార్ధులతో పాటు వారి తల్లితండ్రులకు ఇవాళ్టి నుంచి ప్రీ ఎగ్జామ్ (పరీక్షలకు ముందు ) సైకలాజికల్ కౌన్సెలింగ్ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధుల్లో ఒత్తిడి తగ్గించేందుకు, వారిని పరీక్షలకు మెరుగ్గా సన్నద్ధం చేసేందుకు ఇది ఉపయోగపడబోతోంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2024 బోర్డ్ పరీక్షల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులకు మానసిక కౌన్సెలింగ్ ప్రారంభమైంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సలహాలు ఇవ్వడానికి సీబీఎస్ఈ నిర్వహిస్తున్న ఈ కౌన్సెలింగ్.. వారిని మానసికంగా పరీక్షలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా సాగనుంది. పరీక్షల్లో ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన పద్ధతులపై ఈ కౌన్సెలింగ్ ఉంటుంది.

సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. థియరీ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్దులు, తల్లితండ్రులకు ఈ వార్షిక సైకలాజికల్ కౌన్సెలింగ్ కార్యక్రమం రెండు దశల్లో జరగనుంది. మొదటిది పరీక్షకు ముందు, రెండవది ఫలితాల తర్వాత. సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లోని 10, 12 తరగతుల విద్యార్థులను పరీక్షల సమయంలో, తర్వాత ఒత్తిడి లేకుండా ఉంచడానికి ఇది నిర్వహిస్తున్నారు. 1998 నుండి 26 ఏళ్లుగా ఈ కౌన్సెలింగ్ జరుగుతోంది.
ఈ కౌన్సెలింగ్ లో భాగంగా సీబీఎస్ఈ.. యువత అనుభవాలు, దూకుడు, నిరాశ, ఇంటర్నెట్ వ్యసనం రుగ్మత, పరీక్షల ఒత్తిడి, నిర్దిష్ట అభ్యాస వైకల్యాలు, పదార్థ వినియోగ రుగ్మతలు, వాటిని ఎదుర్కోవటానికి జీవన నైపుణ్యాలు వంటి వివిధ అంశాలపై మల్టీమీడియా కంటెంట్, ఆడియో-విజువల్ కంటెంట్ చూసేందుకు, వినేందుకు వీలు కల్పిస్తోంది.












Click it and Unblock the Notifications