ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కొత్త తేదీలు ఖరారు: ఎప్పట్నుంచంటే?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీలు ప్రకటించింది. తాజా ప్రకటన ప్రకారం జూన్ 3 నుంచి 10వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం.. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనుండగా.. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
సివిల్స్ ఇంటర్వ్యూలకు ఏపీ నుంచి గ్రూప్ 1 పరీక్ష రాసే 25మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. వారిని దృష్టిలో పెట్టుకొని అధికారులు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. కొత్త తేదీల ప్రకారం మెయిన్స్ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పది జిల్లాల్లోని ప్రధాన పరీక్ష కేంద్రాల్లో జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్టికెట్లు మే 24 నుంచి అందుబాటులోకి రానున్నాయి. గ్రూప్- 1 అభ్యర్థులు ఈ సూచనలను అనుసరించాలని ఏపీపీఎస్సీ సూచించింది. మరిన్ని వివరాల కోసం ఏపీపీఎస్సీ వెబ్సైట్ సంప్రదించవచ్చు.

ఏపీ పాలిసెట్ 2023 ఫలితాలు విడుదల
ఏపీ పాలిసెట్ 2023 ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. పాలిసెట్ ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి విజయవాడలో విడుదల చేశారు. ఈసారి నిర్వహించిన పాలిటెక్నిక్ పరీక్షలో 1,24,021 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 86.35 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇందులో కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 88.90శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 84.74శాతం సాధించారు. అయితే ఇందులో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన సుమారు 15మంది విద్యార్థులు 120కు 120 మార్కులు సాధించడం విశేషం.
మే నెల 10వ తేదీన ఏపీ పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మొత్తం 267 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది 77వేల 117 సీట్లను భర్తీ చేయనున్నారు. దాదాపు 31 కోర్సుల్లో 2 సంవత్సరాలు, 3సంవత్సరాలు, మూడున్నరేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 29 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
జులై 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ప్రకటించారు. మొత్తం 77వేల 117సీట్లకు 1,60,329 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 1,43,592 మంది హాజరయ్యారు. అందులో 1, 24,021 మంది ఉత్తీర్ణత సాధించారు. కాగా, ఈ విద్యా సంవత్సరం నుంచి నూతనంగా ప్రారంభిస్తున్న నంద్యాల జిల్లా బేతంచెర్ల, కడప జిల్లా మైదుకూరు, అనంతపురం జిల్లా గుంతకల్లులో ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications