ఆస్కార్ లెవెల్ వీర యాక్టింగ్- పార్లమెంట్ మకర ద్వారం వద్ద: సినీ ఫక్కీలో ఫినిషింగ్ టచ్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ.. అయోధ్య రామమందిర విరాళాల వివాదం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సున్నిత అంశంపై కేంద్ర ప్రభుత్వం చుట్టూ ఉచ్చు బిగించేందుకు ప్రతిపక్షాలు నూతన వ్యూహాన్ని ఎంచుకున్నాయి. పార్లమెంట్ ప్రాంగణంలోని మకర ద్వారం సాక్షిగా ఈ ఉదయం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించేలా ఎంపీలు నాటకీయ శైలిలో ఓ మాక్ మీటింగ్ ను నిర్వహించారు. వీధి నాటకాన్ని తలపించేలా సాగిందిది.
ఈ నిరసన ప్రదర్శనలో రాహుల్ గాంధీ సైతం భాగస్వామి అయ్యారు. పలువురు విపక్ష ఎంపీలు పాల్గొన్నారు. బీహార్లోని పూర్ణియా నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఇండిపెండెంట్ ఎంపీ పప్పు యాదవ్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన పూర్తి కాషాయ వస్త్రాలు ధరించి, ఓ అర్చకుడి అవతారంలో పార్లమెంట్ భవనం వద్దకు చేరుకున్నారు. ఒక పెద్ద హుండీని వెంట తెచ్చుకుని, విరాళాలను అడగడం మొదలుపెట్టారు.

లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. పప్పు యాదవ్ చుట్టూ నిల్చున్నారు. ఒకరి తర్వాత ఒకరుగా హుండీలో విరాళాలు వేయడం ప్రారంభించారు. అందరి నుంచి విరాళాలను స్వీకరించిన వెంటనే పప్పు యాదవ్ హుండీని పట్టుకుని గబగబా అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో రాహుల్ గాాంధీ సహా ఇతర ఎంపీలందరూ కూడా చందా చోరీ నినాదాలు చేయడం ఆకర్షించింది.
హుండీతో పారిపోతున్న పప్పూ యాదవ్ ను అయోధ్యకు చెందిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ వెంబడించారు. కాలర్ పట్టుకుని మరీ వెనక్కి లాక్కొచ్చారు. రామమందిర కానుకలను దొంగిలించే ఇలాంటి వ్యక్తులకు కఠినమైన ఉరిశిక్ష విధించాలంటూ అవధేష్ ప్రసాద్ గట్టిగా నినదించారు. ఇలాంటి చందా చోరీలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని తోటి ఎంపీలు డిమాండ్ చేయడం కనిపించింది.
రామాలయ ట్రస్టుకు లభించిన విరాళాల దుర్వినియోగం అంశాన్ని.. విపక్షాలు.. ప్రత్యేకించి సమాజ్వాదీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతకుముందు రోజు గురువారం కూడా మకర ద్వారం వద్ద ఆ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ ఇదే తరహాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 'చఢావా చోర్, గద్దీ ఛోడ్..' అని నినదించారు. ఏకంగా శ్రీరాముడి విరాళాలను కూడా దొంగిలించి బీజేపీ లబ్ధి పొందుతోందని, ఇది వారి ప్రజా వ్యతిరేక మనస్తత్వానికి అద్దం పడుతోందని విమర్శించారు.
#WATCH | Delhi | Monsoon Session of the Parliament | Opposition MPs including Lok Sabha LoP and Congress MP Rahul Gandhi protest over the issue of alleged Ayodhya Ram Mandir donations embezzlement pic.twitter.com/1BXa6UiUuq
— ANI (@ANI) July 31, 2026












Click it and Unblock the Notifications