ప్రధాని మోదీ భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం వేళ ఏపీకి కేంద్రం మరో వరం!
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవానికి రానున్నారు. ఆగస్ట్ ౧వ తేదీన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అట్టహాసంగా ప్రారంభం కానుంది . ఈ క్రమంలో కేంద్రం ఏపీకి మరో భారీ వరం ప్రకటించింది. ఏపీకి ప్రధాని మోదీ పర్యటన వేళ విశాఖపట్నం రైల్వే స్టేషన్ కు భారీ శుభవార్త చెప్పింది కేంద్రం.
రైల్వే కోచింగ్ యార్డ్ ఆధునికీకరణకు రూ. 229 కోట్ల నిధులు
విశాఖపట్నం రైల్వే స్టేషన్ రైల్వే కోచింగ్ యార్డ్ ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైల్వే కోచింగ్ యార్డ్ ఆధునికీకరణకు రూ, 229 కోట్లను మంజూరు చేసినట్టు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సమయంలో విశాఖ రైల్వే స్టేషన్ కు ఈ నిధులు కేటాయించటం ఒక విశేషం.

విశాఖ రైల్వే స్టేషన్ లో కోచింగ్ యార్డ్ ఇబ్బంది
ఇప్పటికే ఏపీలో రైల్వే ప్రగతి పరుగులు పెడుతుంది, కూటమి ప్రభుత్వ హయాంలో భారీ నిధులు కేటాయించి అనేక రైల్వే ప్రాజెక్ట్ లను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో మళ్ళీ ఏపీకి రైల్వే వరం ప్రకటించటం ప్రధానంగా కనిపిస్తుంది. ప్రతిరోజూ విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి 113 రైళ్లు నడుస్తున్నాయి. సుమారు 80 వేల మంది ప్రయాణికులు నిత్యం విశాఖ ఎయిర్ పోర్ట్ నుండి రాకపోకలు సాగిస్తున్నారు.
కొత్త నిధులతో చేసే పనులు ఇవే
ప్రస్తుత కోచింగ్ యార్డ్ సరిపోకపోవడంతో ప్లాట్ఫామ్లు తగినంతగా అందుబాటులో లేవు. రైళ్లు వచ్చే సమయంలో క్రాసింగ్ స్థలం లేక సిగ్నల్స్ దగ్గరే చాలాసేపు నిలిపివేయాల్సి వస్తోంది. అది ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. ఈ సమస్యలు పరిష్కరించేందుకు యార్డ్ను ఆధునికీకరించనున్నారు. కొత్త నిధులతో లూప్ లైన్లు తొలగించి ప్రస్తుత ప్లాట్ఫామ్లను విస్తరిస్తారు. అదనంగా ఆరు ప్లాట్ఫామ్లు, ఆరు రైల్వే లైన్లు నిర్మిస్తారు.
ప్రధాని ఉత్తరాంధ్ర పర్యటన సమయంలో విశాఖ రైల్వేలో మరో కీలక అడుగు
ప్రయాణికుల సౌకర్యార్థం ర్యాంపులు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులు పూర్తయితే స్టేషన్ రూపురేఖలు మారిపోతాయి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయి. రద్దీ తగ్గి రైళ్ల నిర్వహణ సులభమవుతుంది. ప్రధాని ఉత్తరాంధ్ర పర్యటన సమయంలో చేసిన ఈ ప్రకటన విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఒక ముఖ్యమైన అడుగు కానుంది. ఈ మేరకు త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.













Click it and Unblock the Notifications