భారత్ లో తొలి అమెరికా యూనివర్శిటీ క్యాంపస్..! ఆఫర్ చేస్తున్న కోర్సులివే..!
కాలం మారుతోంది. అమెరికాలో భారతీయ వర్సిటీలు క్యాంపస్ లు ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో భారతీయ విద్యార్ధులకు మరిన్ని అడ్మిషన్లు, అంతర్జాతీయ స్థాయి డిగ్రీలు లభించే అవకాశం కలుగుతోందని అంతా సంతోషిస్తున్నారు. అదే సమయంలో భారత్ కు సైతం అమెరికా యూనివర్శిటీలు తరలివస్తున్నాయి. ఇదే క్రమంలో అమెరికా టెక్ యూనివర్శిటీ ఒకటి ముంబైలో తమ క్యాంపస్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుంది. దీన్ని యూజీసీ ఆమోదించింది. దీంతో భారత్ లో క్యాంపస్ పెడుతున్న తొలి యూఎస్ వర్సిటీ (First Us University)గా ఇది గుర్తింపు సాధించబోతోంది.
ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇల్లినాయిస్ టెక్) తన ముంబై క్యాంపస్ను ప్రారంభించేందుకు యూజీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో యూఎస్ కు చెందిన ఈ టెక్నాలజీ-కేంద్రీకృత పరిశోధనా విశ్వవిద్యాలయం.. సెప్టెంబర్ లో ప్రారంభమయ్యే తన మొదటి బ్యాచ్ కోసం విద్యా కార్యకలాపాలను ప్రారంభించింది. దీంతో ఇందులో విద్యార్థులను చేర్చుకోవడానికి వీలు కలుగుతుంది. ప్రారంభ ఫాల్ 2026 ఇన్టేక్ కోసం దరఖాస్తులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిషన్లు, స్కాలర్షిప్లు, ఫ్యాకల్టీ, క్యాంపస్ గురించిన మరింత సమాచారాన్ని విశ్వవిద్యాలయం యొక్క వెబ్సైట్ iit.edu/mumbai ద్వారా పొందవచ్చు.

ఇల్లినాయిస్ టెక్ ముంబై క్యాంపస్ లో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిజినెస్ , ఇంజనీరింగ్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లతో పాటు, ఇన్నోవేషన్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం రూపొందించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను కూడా అందుబాటులో ఉంచారు. కరికులమ్ లో విద్యాపరమైన కఠినత్వం, ప్రాజెక్ట్-ఆధారిత అభ్యాసం, అంతర్-విభాగ సహకారం , పరిశ్రమ భాగస్వామ్యం కలిసి ఉంటాయి. అధునాతన సాంకేతిక నైపుణ్యాలు, ప్రపంచ స్థాయి అనుభవం, పరిశ్రమకు సిద్ధంగా ఉండే నైపుణ్యం కలిగిన గ్రాడ్యుయేట్ల కోసం భారత్ లో పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి ఈ క్యాంపస్ను ఏర్పాటు చేసినట్లు యూనివర్శిటీ తెలిపింది. దీంతో పాటు మొత్తం 15 విదేశీ వర్సిటీలకు యూజీసీ ఈ మధ్యే ఆమోదం తెలిపింది.















Click it and Unblock the Notifications