First AI University: అమరావతిలో తొలి ఏఐ యూనివర్శిటీ-డేట్ ఫిక్స్..!
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథకు డిమాండ్ పెరుగుతోంది. ఉద్యోగాల నుంచి పరిశోధనల వరకూ ఏఐ (AI) కేంద్రంగానే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని కేంద్రంగా తొలి ఏఐ యూనివర్శిటీని ప్రారంభించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందులో ఏఐ సంబంధిత కోర్సులతో పాటు పరిశోధనలకు కూడా నిర్వహించబోతున్నారు. ఈ యూనివర్శిటీ ప్రారంభానికి ముహుర్తం కూడా ఖరారైంది.
ఏఐ దిగ్గజ సంస్థ ఎన్విడియా సాయంతో అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోంది. ఇందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల 19న ఈ యూనివర్శిటీని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ తాజాగా విశాఖలో ప్రకటించారు. ఎన్విడియాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం రెండేళ్లలో పది వేల మంది ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఏఐ, మెషిన్ లెర్నింగ్ కోర్సుల్లో ఇది శిక్షణ ఇవ్వబోతోంది.

అలాగే ఈ ఏఐ యూనివర్శిటీ రాష్ట్రంలో ఇప్పటికే ఏఐపై పనిచేస్తున్న స్టార్టప్స్ కు కూడా సాయం చేయబోతోంది. ఆయా స్టార్టప్స్ కు సాంకేతిక సాయం, మార్గదర్శకత్వం, అంతర్జాతీయ మార్కెట్లు, పెట్టుబడులతో నెట్వర్క్ చేయడానికి అవకాశాల్ని గుర్తించి వారికి అందించబోతోంది. రాష్ట్రంలో ఇలా 500 ఏఐ స్టార్టప్ లకు ఇది ఉపయోగపడనుంది. దీన్ని తర్వాతి దశల్లో మరింతగా విస్తరిస్తారు.

ఈ ఏఐ విశ్వవిద్యాలయం ఎన్విడియా సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, పాలన, ఫిన్టెక్ , లాజిస్టిక్స్ వంటి రంగాలలో ఏఐ యొక్క వాస్తవ ట్రెండ్స్ పై ఫోకస్ చేయబోతోంది. అలాగే ఎన్విడియా ఏఐ ల్యాబ్ లు కూడా యూనివర్శిటీలోనే ఏర్పాటు చేస్తారు. రాష్టంలోని టైర్-2, టైర్-3 పట్టణాల నుండి వచ్చిన పిల్లలకు దీన్ని అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా ప్రస్తుత ఏఐ, మెషిన్ లెర్నింగ్స్ ట్రెండింగ్ కోర్సుల్నివారు ఇక్కడే అభ్యసించే అవకాశం కలగబోతోంది.












Click it and Unblock the Notifications