మోదీ వరాలు! దేశమంతటా ఫ్రీ ఆన్లైన్ కోచింగ్, కోటి మందికి ఏఐ..
పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే పేద, మధ్యతరగతి కుటుంబాలపై పడుతున్న కోచింగ్ ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నేటి పోటీ ప్రపంచంలో తమ పిల్లలను పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లకు పంపలేక సగటు తల్లిదండ్రులు పడుతున్న వేదనను తొలగించేలా, దేశవ్యాప్తంగా ఉచిత ఆన్లైన్ కోచింగ్ నెట్వర్క్ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఎర్రకోట బురుజులపై నుంచి స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఆయన ఈ సంచలన హామీ ఇచ్చారు.
ప్రస్తుత కాలంలో పిల్లలను ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు పంపకపోతే రేసులో వెనుకబడిపోతామేమోనన్న భయంతో మధ్యతరగతి తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు అప్పులు చేసి మరీ ఖర్చు చేస్తున్నారు. ఈ ఆర్థిక భారాన్ని గమనించిన ప్రభుత్వం, దేశంలోని ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను, మన అధునాతన డిజిటల్ నెట్వర్క్ను అనుసంధానిస్తూ ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనివల్ల విద్యార్థులు తమ ఇళ్లను, కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నాణ్యమైన కోచింగ్ పొందవచ్చు.

డిజిటల్ శక్తితో నవభారత విప్లవం
మన దేశంలో ఇప్పటికే అత్యుత్తమ డిజిటల్ మౌలిక వసతులు, అద్భుతమైన ఉపాధ్యాయుల బృందం అందుబాటులో ఉందన్న ప్రధాని, వారందరినీ ఒకే వేదికపైకి తెచ్చి బృహత్తర ఆన్లైన్ కోచింగ్ వ్యవస్థను నిర్మిస్తామని చెప్పారు. సగటు కుటుంబాలు కోచింగ్ కోసం పెట్టే వేల కోట్ల రూపాయలను ఆదా చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. విద్యార్థులకు కుటుంబ సభ్యుల ఆప్యాయతతో పాటు నాణ్యమైన విద్య కూడా వారి సొంత ఊళ్లలోనే లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
12 ఏళ్ల ప్రగతి పరుగు.. అగ్రగామిగా భారత్
ఒకప్పుడు ప్రపంచంలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాల జాబితాలో నిలిచిన భారత్, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని మోదీ గుర్తుచేశారు. గత 12 ఏళ్లలో రక్షణ రంగ ఉత్పత్తి 4 రెట్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ 7 రెట్లు, రైల్వే కోచ్ల ఉత్పత్తి 21 రెట్లు, డిజిటల్ లావాదేవీలు ఏకంగా 100 రెట్లు పెరిగినట్లు వెల్లడించారు. అంతేకాకుండా సెమికండక్టర్ల తయారీలో భారత్ త్వరలోనే ప్రపంచ శక్తులకు గట్టి పోటీ ఇవ్వబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
కోటి మందికి ఏఐ శిక్షణ.. ఒలింపిక్స్ లక్ష్యాలు
భవిష్యత్ సాంకేతికతకు అనుగుణంగా దేశంలోని కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో ప్రత్యేక నైపుణ్య శిక్షణ అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఆటల రంగానికి సంబంధించి 2030 కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోందని, అలాగే 2036 ఒలింపిక్స్ను మన దేశంలోనే నిర్వహించేలా ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం మునుపెన్నడూ లేని విధంగా కొత్త క్రీడల్లో మన క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి గ్లోబల్ వేదికపై భారత్ జెండాను రెపరెపలాడిస్తామని ప్రకటించారు.














Click it and Unblock the Notifications