తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్ధులకు షాక్-హైకోర్టు కీలక తీర్పు..!
తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలను వివాదాలు వీడటం లేదు. తొలుత ఈ పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ పలువురు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించడం, దీనిపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడం, దీంతో వారు సుప్రీంకోర్టు వరకూ వెళ్లడం, హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు కూడా తేల్చేయడంతో పరీక్షలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోయాయి. అయితే పరీక్షలు రాశాక కూడా రిజర్వేషన్ల వివాదం తేలేవరకూ ఫలితాలు ప్రకటించవద్దంటూ అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది.
తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు రాసిన కొందరు అభ్యర్ధులు రిజర్వేషన్లు, ఇతర అంశాలపై తాము దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకూ ఫలితాలు ప్రకటించవద్దంటూ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ వాటిని కొట్టేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా రిజర్వేషన్ల వ్యవహారం తేలే వరకూ గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించవద్దంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. దీంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాల విడుదలకు కూడా మార్గం సుగమం అయింది.

గతంలో తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించవద్దని, నిర్వహించినా ఫలితాలు ప్రకటించవద్దంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు, సుప్రీంకోర్టు తోసిపుచ్చిన తర్వాత పరీక్షలు యథాతథంగా జరిగాయి. ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. అయితే రిజర్వేషన్లు తేలేంత వరకు గ్రూప్-1 పరీక్షల ఫలితాలను ఆపాలంటూ అభ్యర్థులు మరోసారి హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా నిరాశ తప్పలేదు. హైకోర్టు నిర్ణయం నేపథ్యంలో గ్రూప్ 1 ఫలితాల విడుదలకు టీజీపీఎస్సీ సిద్దమవుతోంది.












Click it and Unblock the Notifications