Engineers day: నాటి నిర్మాణాలు నేటికి జాతి సంపదగా..మానవ మేధస్సుకు నిలువుటద్దం మోక్షగుండం
ఏటా సెప్టెంబర్ 15వ తేదీన భారత్ శ్రీలంక మరియు టాంజానియాతో కలిసి జాతీయ ఇంజినీర్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది.భరతమాత ముద్దు బిడ్డ,ఎన్నో ప్రాజెక్టుల రూపశిల్పి అయిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టిన రోజు అయిన సెప్టెంబర్ 15న ఇంజినీర్స్ డేను జరుపుకుంటారు.అంతేకాదు భావి భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి ఇంజినీర్ను ఈ సందర్భంగా సత్కరించడం జరుగుతుంది.
ఇంజనీరింగ్ మరియు విద్యా రంగంలో మోక్షగుండం సహకారం గణనీయమైనది. ఆధునిక భారతదేశంలో ఆనకట్టలు, రిజర్వాయర్లు మరియు హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గొప్ప ఇంజినీర్గా ఆయన పరిగణించబడతారు.
1968 లో, భారత ప్రభుత్వం సర్ ఎం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజనీర్స్ డేగా ప్రకటించింది. అప్పటి నుండి, ఆధునిక మరియు అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని నిర్మించడంలో కృషి చేసిన మరియు ఇప్పటికీ కృషి చేస్తున్న ఇంజనీర్లందరినీ సత్కరించడానికి వారిని గుర్తించేందుకు ఈ రోజును ఇంజినీర్స్ డేగా జరుపుకుంటారు.

1903 లో, సర్ ఎమ్ విశ్వేశ్వరయ్య ఆటోమేటిక్ బారియర్ వాటర్ ఫ్లడ్గేట్ను డిజైన్ చేసి పేటెంట్ పొందారు. దీన్ని బ్లాక్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు, ఇది నీటి ఓవర్ ఫ్లో సంభవించినప్పుడు మూసివేసే ఆటోమేటెడ్ తలుపులు కలిగి ఉంటుంది. ఇది మొదట పూణేలోని ఖడక్వాస్లా జలాశయంలో స్థాపించడం జరిగింది. 1861 లో కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన సర్ ఎమ్ విశ్వేశ్వరయ్య... మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చదివారు మరియు కాలేజ్ ఆఫ్ సైన్స్, పూణేలో సివిల్ ఇంజనీరింగ్ చేశారు. 1917 లో, అతను బెంగుళూరు యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని పిలువబడే ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించాడు.
1908లో హైదరాబాదు మహానగరం వరదల బారిన పడింది. నాడు ఆ అందమైన నగరం రూపురేఖలు లేకుండా పోయింది. మూసీ నదిలో వరదలతో భాగ్యనగరం కొట్టుకుపోయింది. దీంతో నగరంలో డ్రైనేజీ వ్యవస్థను బాగుపర్చాలని భావించిన నిజాం.. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలకోసం ఆశ్రయించాడు. హైదరాబాద్ను పూర్తిగా స్టడీ చేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య... హైదరాబాద్ గుండా ప్రవహించే మూసినది పై దృష్టి సారించారు.వరదల పునరుక్తిని నివారించడానికి, నగరంలో మౌలిక పౌర సౌకర్యాలను మెరుగుపరడానికి కొన్ని సూచనలు చేస్తూ 1909, అక్టోబరు 1న తన నివేదిక సమర్పించాడు.ఏడవ నిజాం 1912లో ఒక నగరాభివృద్ధి ట్రస్టును ప్రారంభించాడు. వరదలను నివారించేందుకు ఒక వరద నివారణ వ్యవస్థను కట్టించాడు. 1920లో మూసీ నదిపై ఒక నగరానికి పది మైళ్ళ ఎగువన ఉస్మాన్ సాగర్ ఆనకట్టను కట్టించారు. 1927లో మూసీ ఉపనదైన ఈసీ నదిపై హిమాయత్ సాగర్ అనే మరో జలాశయము నిర్మించారు. ఈ రెండు జలాశయాలు మూసీ నదికి వరదలు రాకుండా నివారించడముతో పాటు హైదరాబాదు నగరానికి ప్రధాన మంచినీటి వనరులుగా ఉపయోగపడుతున్నాయి.
Recommended Video
ఒకసారి డాక్టర్ విశ్వేశ్వరయ్య బ్రిటిష్ ఇండియాలో రైలులో ప్రయాణిస్తున్నారు. చాలా మంది బ్రిటిష్ వారు ఈ రైలులో ఉన్నారు. బ్రిటిష్ వారు అతడిని మూర్ఖుడు మరియు నిరక్షరాస్యులు అని ఎగతాళి చేశారు. ఈ సమయంలో, డాక్టర్ విశ్వేశ్వరయ్య అకస్మాత్తుగా రైలు గొలుసును లాగారు. కాసేపటి తర్వాత గార్డు వచ్చి గొలుసు ఎవరు లాగారు అని అడిగారు? అప్పుడు డాక్టర్ విశ్వేశ్వరయ్య నేను గొలుసు లాగాను, ఎందుకంటే ఇక్కడి నుండి కొంత దూరంలో రైల్వే ట్రాక్ సరిగ్గాలేదని ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని తనకు అనిపిస్తోందని చెప్పారు. దీనిపై గార్డు మీకు ఎలా తెలుసు అని అడిగాడు. అప్పుడు విశ్వేశ్వరయ్య 'రైలు సహజ వేగంలో వ్యత్యాసం ఉంది మరియు ధ్వనిలో కూడా కాస్త వ్యత్యాసం ఉన్నట్లు తనకు తడుతోందని చెప్పారు. . దీని తరువాత, ట్రాక్ను పరిశీలించినప్పుడు, ఒక ప్రదేశంలోని రైల్వే ట్రాక్ యొక్క కీళ్ళు తెరిచి ఉన్నాయి. నట్లు బోల్టులు విరిగిపడి ఉన్నాయి. విశ్వేశ్వరయ్య మేధోశక్తిని చూసిన బ్రిటీష్ వారు అతన్ని ప్రశంసించారు.
1955లో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నతో గౌరవించింది. బ్రిటిష్ నైట్హుడ్ కూడా లభించింది. అతను 1912 నుండి 1918 వరకు మైసూర్ దివాన్గా పనిచేశాడు; ఇంజినీర్స్ దినోత్సవం సందర్భంగా, సర్ విశ్వేశ్వరయ్యకు దేశం నివాళి అర్పిస్తోంది.












Click it and Unblock the Notifications