మనిషి బతకాలంటే కావల్సింది 'బ్రాండ్' కాదు... ప్రేమ!
మనిషి సంఘజీవి. నలుగురితో కలిసి జీవిస్తుంటాడు. నలుగురికి ప్రేమను పంచుతూ తిరిగి ఆ ప్రేమను పొందుతుంటాడు. కన్న తల్లిదండ్రుల నుంచి, సోదరుల నుంచి, తోబుట్టువుల నుంచి, స్నేహితుల నుంచి... ఇలా అందరి నుంచి ప్రేమను పొందే మనిషి తాను తిరిగి వారికి అదే ప్రేమను అందించాలి. దీనివల్ల వారి మధ్య ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ విషయం సంఘంలో జీవించే ప్రతి మనిషికి వర్తిస్తుంది. సినిమా హీరోలు దీనికి అతీతులేంకాదు. వారికి కావల్సింది కూడా ప్రేమే. లక్షల సంఖ్యలో ఉన్న అభిమానులు వారికి వెలకట్టలేనంత అభిమానాన్ని, ప్రేమను అందిస్తున్నారు. కానీ అల్లు అర్జున్ లాంటి హీరోలు ఆ అభిమానాన్ని, ప్రేమను ఆలంబనగా చేసుకొని AA బ్రాండ్ ను సృష్టించుకుంటున్నారు. తద్వారా కోట్లరూపాయలను ఆర్జిస్తున్నారు.
భార్యను పంపించవచ్చుకదా
ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న 9 సంవత్సరాల శ్రీతేజ్ ను పరామర్శించాలంటే తనకు కొన్ని న్యాయపరమైన విషయాలున్నాయని అల్లు అర్జున్ మీడియాకు చెప్పారు. అలాంటప్పుడు తానే వెళ్లాల్సిన అవసరంలేదు. తనకు బదులుగా తన భార్య స్నేహారెడ్డిని పంపించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పొచ్చు. అభిమానులు అంటే తనకు ప్రాణం అని పదే పదే చెప్పే అల్లు అర్జున్ మృతిచెందిన రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ప్రకటించి చేతులు దులుపుకున్నారు. కానీ తాను కోర్టు నుంచి బయటపడటానికి మాత్రం రూ.4 కోట్లు ఖర్చుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. తన వీరాభిమాని మరణించినప్పుడు కనీసం అక్కడకు వెళ్లే ప్రయత్నం చేయలేదు.. ఆసుపత్రిలో ఉన్న శ్రీతేజ్ ను పరామర్శించడమే తెలియదన్నట్లుగా వ్యవహరించారు. అంత తొక్కిసలాటలో కూడా తన భార్య స్నేహారెడ్డి పోగొట్టుకున్న పర్సు కోసమే వెతికారు. అది దొరికిందో లేదో వారికే తెలియాలి.

సరిహద్దుల్లో యుద్ధం చేసి వచ్చాడా?
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా వచ్చి అల్లు అర్జున్ ను పరామర్శించి వెళుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుల్లో అతను యుద్ధం ఏమీ చేసిరాలేదు పలకరించడానికి. వారెవరికీ రేవతి కుటుంబం గుర్తుకురావడంలేదు. ఎందుకంటే అల్లు అర్జున్ దగ్గర AA అనే బ్రాండ్ ఉంది. స్టార్ హీరో.. తండ్రి పెద్ద నిర్మాత.. మేనమామ మెగాస్టార్.. మరో మేనమామ ఉప ముఖ్యమంత్రి... ఇలాంటి అర్హతలున్నాయి.. డబ్బులున్నాయి. కాబట్టి సినీ ప్రముఖులంతా కొంపలు మునిగిపోయినట్లు అల్లు అర్జున్ ఇంటికి పరుగులు తీస్తున్నారు. ఈరోజుకు కూడా వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదంటే ఆశ్చర్యం వేయకమానదు. ఎందుకంటే మరణించిన మహిళ, ఆసుపత్రిలో ఉన్న బిడ్డ అల్లు అర్జున్ అభిమానులు కాబట్టి. తమ అభిమానులు కాదు కదా. ఇదీ సినీ జీవుల తీరు. వీరికోసం వందలు, వేల రూపాయలు ఖర్చుపెట్టి సినిమా టికెట్లు కొని వీరిని బాగు చేయడం అవసరమా? అనే విషయాన్ని ప్రతి తెలుగువాడు గుండెలమీద చేయివేసుకొని ఆలోచించాలి.
వారికే అంతవుంటే ప్రజలకెంత ఉండాలి?
హీరోయిన్ తో తైతక్కలాడుతూ, నలుగురిని కొట్టి, నాలుగు డైలాగు చెప్పే డ్రామాను సినిమాలా తీసి టికెట్లు అమ్ముకొని బతికేవారికే అంతవుంటే ఆ టికెట్లను కొనుగోలు చేసి దర్జాగా కుర్చీలో కూర్చొని ఆ సినిమాను చూస్తూ ఎంటర్ టైన్ అయ్యే ప్రజలకెంత ఉండాలి? మొత్తం రాజ్యాన్ని పరిపాలించే ప్రభుత్వానికెంత ఉండాలి?. చట్టానికి కట్టుబడి ఉండేవారు ప్రేమకు కూడా కట్టుబడి ఉండాలి. చెప్పే మాటను చేతల్లో చేసి చూపించాలి. కానీ అవన్నీ సినిమా డైలాగుల్లా మాటలకే పరిమితం చేయడం తగదు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన ప్రజలకు, అభిమానులకు ఓ గుణపాఠం నేర్పుతోంది. హీరోలంతా తమ డబ్బుల కోసం, తమ వ్యాపారం కోసం మాత్రమే అభిమానులను పునాదిగా వాడుకుంటారనేది అర్థమైంది. ఇకనుంచైనా పిచ్చి పిచ్చి అభిమానాలను, పిచ్చి పిచ్చి ప్రేమలను హీరోలపై పెంచుకోకుండా తమ జీవితాలను చక్కదిద్దుకుంటే చాలు. అదే వారికి, వారి కుటుంబానికి శ్రీరామరక్ష.












Click it and Unblock the Notifications