అమ్మాయిలూ.. 'రెంటల్ బాయ్ఫ్రెండ్స్'తో జాగ్రత్త: సజ్జనార్..!!
యువతులకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ కీలక అలర్ట్ చేసారు. రెంటల్ బాయ్ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెంట్ బాయ్ఫ్రెండ్ ఆఫర్ల వెనుక సైబర్ మోసం ఉందని హెచ్చరించారు. యువతులు, అమ్మాయిలే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు విసురుతున్న ఈ కొత్త డేటింగ్ ట్రాప్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సోషల్ మీడియా వేదికగా "రెంట్-ఎ-బాయ్ఫ్రెండ్" ఆఫర్ల పైన హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక హెచ్చరిక చేసారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టింగ్ చేసారు. అమ్మాయిలు, యువతులే టార్గెట్గా సైబర్ కేటుగాళ్లు కొత్త డేటింగ్ పేరుతో ట్రాప్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఆకర్షణీయమైన పోస్టర్లతో సైబర్ క్రిమినల్స్ యువతులకు వల వేస్తున్నారని తెలిపారు.

'1st August Special - 50% OFF' అంటూ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించారని చెప్పుకొచ్చారు. కాఫీ డేట్ - రూ.499, సినిమా డేట్ - రూ.1,249 అంటూ ప్యాకేజీలు ప్రకటించారని తెలిపారు. షాపింగ్, ఈవెంట్లు, పెళ్లిళ్లకు తోడుగా వస్తామంటూ వివిధ ధరలతో సైబర్ క్రిమినల్స్ ఆఫర్లు ఇచ్చారని చెప్పుకొచ్చారు.
ఇంటర్నెట్ ..ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా సృష్టించిన అందమైన కుర్రాళ్ల ఫోటోలను చూపిస్తూ.. గోప్యత పాటిస్తామని నమ్మిస్తారని పేర్కొన్నారు. బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో క్యూఆర్ కోడ్లు, డిజిటల్ వ్యాలెట్ల ద్వారా డబ్బులు వసూలు చేసి అకౌంట్లను బ్లాక్ చేస్తున్నారని అప్రమత్తం చేసారు. ఆన్లైన్ చాటింగ్లో సేకరించిన ఫోన్ నంబర్లు, వ్యక్తిగత ఫోటోల ఆధారంగా ఆ తర్వాత బెదిరింపులకు, బ్లాక్ మెయిలింగ్కు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అమ్మాయిలూ.. రెంట్ బాయ్ఫ్రెండ్ ఆఫర్ల వల.. జాగ్రత్త!!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) August 8, 2026
"ఒంటరితనంతో బాధపడుతున్నారా? మీతో కాఫీ తాగడానికి, సినిమాకెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా? అది కూడా 50 శాతం ఆఫర్లతో!".. సోషల్ మీడియాలో రకరకాల ఆఫర్ల పేరుతో కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ పోస్టర్ల వెనుక పెద్ద సైబర్ మోసం దాగి ఉంది.… pic.twitter.com/E7O1mgwUip
డబ్బులు తీసుకున్న తర్వాత అకౌంట్లు బ్లాక్ చేసి సైబర్ క్రిమినల్స్ మాయం అవుతారని సీపీ సజ్జనార్ వివరించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల సోషల్ మీడియా, ఆన్లైన్ పరిచయాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకవేళ ఈ సైబర్ ట్రాప్లో చిక్కుకుంటే భయపడకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు కాల్ చేయాలి లేదా cybercrime. gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సీపీ సజ్జనార్ సూచించారు.




Click it and Unblock the Notifications