తిరుమలలో భక్తులు కోరుకుంటున్నది ఏంటి- ఫీడ్ బ్యాక్ ఇలా..!!
తిరుమలలో సాలికట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. గతం కంటే రద్దీ తగ్గింది. సాధారణ భక్తులకు బ్రహ్మోత్సవాల వేళ ప్రాధాన్యత దక్కే విధంగా ఈ నెల 23వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసారు. ఇక.. సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన సమయంలో భక్తులకు సదుపాయాలను ప్రారంభించారు. కాగా.. తిరుమలలో టీటీడీ అందిస్తున్న సేవల పైన భక్తుల నుంచి ఈవో రవిచంద్ర స్వయంగా ఫీడ్ బ్యాక్ స్వీకరించారు.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం ఉదయం జరిగిన సింహ వాహనసేవను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వారితో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ముచ్చటించారు. వాహనసేవను వీక్షిస్తున్న భక్తుల గ్యాలరీలోకి వెళ్లిన ఈవో, భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు, ఏర్పాట్లపై వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు, హైదరాబాద్, నెల్లూరు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఈవో ఆత్మీయంగా మాట్లాడారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, దర్శన ఏర్పాట్లు, వాహనసేవ వీక్షణకు చేసిన ఏర్పాట్లపై భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. శ్రీవారి సేవకులతో ఈవో మాట్లాడుతూ, భక్తులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందించాలని సూచించారు.

భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్
అదే విధంగా బ్రహ్మోత్సవాలకు విచ్చేసే ప్రతి భక్తుడికి ఆత్మీయతతో సేవలందిస్తూ, శ్రీవారి దర్శన అనుభూతిని మరింత ఆనందదాయకంగా తీర్చిదిద్దాలని సూచించారు. టీటీడీ అందిస్తున్న వివిధ సేవలు, సౌకర్యాలను ఎప్పటికప్పుడు భక్తులకు చేరవేస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా స్పందించాలని సేవకులకు నిర్దేశించారు. భక్తి, సేవ, ఆతిథ్యంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో తెలిపారు. కాగా.. తిరుమలలో కొత్తగా భక్తులకు 22 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటు లోకి వచ్చాయి. ఉచితంగా ఈ బస్సుల్లో సేవలు అందించనున్నారు. అదే విధంగా భక్తులకు వసతి కష్టాలు.. ఫిర్యాదుల కోసం కొత్తగా నందకం యాప్ ను టీటీడీ ప్రారంభించింది. రెండు గంటల సమయంలోనే ఫిర్యాదులను పరిష్కరించేలా ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు.













Click it and Unblock the Notifications
