పవన్కు ముప్పు.. Yప్లస్ సెక్యూరిటీకి కేంద్రం ఆదేశం !!
పవన్ సింగ్.. భోజ్పురి సినీ పరిశ్రమలో ఒక బ్రాండ్. ఆయన పాటలు, సినిమాలు, యాక్షన్ సీక్వెన్స్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. "లాలిపాప్ లగేలూ" పాటతో ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. కానీ అనూహ్యంగా వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే ఇటీవల జరిగిన స్టేజ్ షోలో హీరోయిన్ అంజలి రాఘవ్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనతో పవన్ సింగ్ పేరు వార్తల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆ సంఘటనపై ఆయన క్షమాపణలు చెబుతూ, తన ఉద్దేశం తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పినా, విమర్శలు మాత్రం తగ్గలేదు. ఇక రెండు రోజుల క్రితం ఆయన రెండో భార్య జ్యోతి సింగ్ సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలు పెద్ద కలకలాన్ని రేపాయి.
ప్రాణ హాని..
మరోవైపు ఇటీవల పవన్ సింగ్ రాజకీయాల్లో అడుగుపెట్టనున్నారనే విషయం పెద్ద చర్చగా మారింది. బీజేపీ నాయకులు అమిత్ షా, ఉపేంద్ర కుశ్వాహా లతో ఆయన సమావేశమయ్యారు. మరోవైపు పవన్ సింగ్పై ఇటీవల ఓ హోటల్ యజమాని రూ.1.5 కోట్ల పెట్టుబడి మోసం చేశాడని ఆరోపిస్తూ ఫ్రాడ్ కేసు నమోదు చేయాలని వారణాసి కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా, బాబా ఖాన్ గ్యాంగ్ నుంచి ఆయనకు బెదిరింపు వీడియోలు వచ్చినట్లు కూడా సమాచారం. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నివేదిక ప్రకారం.. పవన్ సింగ్కు ప్రాణహాని ఉన్నట్లు గుర్తించడంతో కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ Y+ కేటగిరీ భద్రత కల్పించింది. 11 మంది సీఆర్పీఎఫ్ కమాండోలు, వ్యక్తిగత భద్రతా అధికారులు (PSOs) 24 గంటల భద్రతను అందించనున్నారు. ఇటీవలి కాలంలో ఆయన రాజకీయంగా చురుకుగా వ్యవహరిస్తూ, బీహార్ రాష్ట్రంలో బీజేపీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.
పవన్ సింగ్పై జ్యోతి సింగ్ ఫైర్..
జ్యోతి సింగ్ తన ఇన్స్టాగ్రామ్ లైవ్లో కన్నీళ్లు పెట్టుకుని మాట్లాడుతూ.. "తాను భర్త ఇంటికి వెళ్తే పోలీసులు వచ్చి తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని" పేర్కొంది. భార్యను బయటకు గెంటేయాలని పోలీసులను పిలిపించుకున్న పవన్ సింగ్ సమాజానికి సేవ చేస్తాడా? ఎన్నికల సమయంలో నన్ను ఉపయోగించి, నా పేరుతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఎన్నికలు అయిపోయాక మాత్రం మరో మహిళతో హోటల్కి వెళ్తున్నాడు. కానీ నన్ను మాత్రం నా భర్త ఇంటికి ఎందుకు వెళ్లడం లేదని అందరూ ప్రశ్నిస్తున్నారు. అతని తప్పులను మాత్రం ఎవరూ అడగరు," అంటూ ఆమె గళం విప్పింది.
భార్యగా నేను నా భర్త వేరే అమ్మాయితో ఉంటున్నాడని చూసి భరించలేకపోయాను. అందుకే నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను," అంటూ ఆమె భావోద్వేగానికి గురైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానులు, నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది జ్యోతి సింగ్కు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు ఇది రాజకీయ లక్ష్యాలతో జరుగుతోందని కామెంట్ చేస్తున్నారు.
పవన్ సింగ్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. 2014లో ఆయన ప్రియకుమారి సింగ్ అనే మహిళను వివాహం చేసుకున్నారు. కానీ కేవలం ఏడాదికే వీరి మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారు. తరువాత 2018లో పవన్ సింగ్ జ్యోతి సింగ్ను రెండోసారి వివాహం చేసుకున్నారు. అయితే వివాహానంతరం కూడా వీరి మధ్య ఘర్షణలు, ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు లేటస్ట్ గా ఇన్స్టాగ్రామ్ లైవ్ వీడియోతో ఆ కుటుంబ వివాదం మళ్లీ వెలుగులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications