సీఎం విజయ్ సర్కార్లో సినీ ప్రముఖుల హవా.. బిగిల్ నిర్మాతకు కీలక ఛాన్స్!
తమిళ రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. తమిళ సినిమా రంగానికి చెందిన ప్రముఖ నిర్మాత, ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సీఈవో అర్చనా కల్పాతి, ప్రముఖ సింగర్ వేల్మురుగన్లకు తమిళనాడు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు లభించాయి. రాష్ట్రంలోని హిందూ ధర్మాదాయ శాఖ పరిధిలోని దేవాలయాలకు వంశపారంపర్యేతర ధర్మకర్తలను ఎంపిక చేసేందుకు విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా అర్చన, వేర్మురుగన్లు నియమితులయ్యారు.
రూ.10 లక్షలకు పైగా వార్షిక ఆదాయం ఉన్న ప్రముఖ ఆలయాలకు అర్హులైన ధర్మకర్తలను ఎంపిక చేసేందుకు ఈ ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన అభ్యర్థుల ప్యానెల్ను సిద్ధం చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. సాంస్కృతిక, సినీ రంగానికి చెందిన ప్రముఖులను ఈ కమిటీలో భాగస్వాములను చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కమిటీకి మైలం బొమ్మపురం అదీనం శ్రీ శివజ్ఞాన బాలయ్య స్వామి ఛైర్మన్గా వ్యవహరించనుండగా.. రిటైర్డ్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి వైస్ ఛైర్మన్ గా.. అలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషించనున్నారు. అలాంటి కమిటీలో సినీ రంగానికి చెందిన మహిళా నిర్మాతను భాగస్వామ్యం చేయడం చర్చనీయాంశంగా మారింది.

అర్చన కల్పాతి సీఈవోగా వ్యవహరిస్తున్న ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ గతంలో విజయ్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమాలు 'బిగిల్', 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'లను నిర్మించింది. సినిమా రంగంలో విజయం సాధించిన అర్చన కల్పాతి.. ఇప్పుడు ఆలయ పాలకమండళ్ల నియామక ప్రక్రియలో కీలక పాత్ర పోషించనున్నారు. కంప్యూటర్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అర్చన కల్పాతి.. తమిళనాడు వ్యాప్తంగా మల్టీప్లెక్స్ థియేటర్లను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దళపతి విజయ్ తన గత సినిమాలకు తెరవెనుక పనిచేసిన కీలక వ్యక్తులకు టీవీకే ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెడుతున్నట్లు తెలుస్తోంది. అర్చన కల్పాతితో పాటు సినిమా రంగానికి చెందిన తన సన్నిహితులకు, వృత్తిపరంగా తనతో కలిసి ప్రయాణించిన వారికి పాలనలో భాగస్వామ్యం కల్పిస్తుండటం రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
విజయ్ సర్కారులో పదవులు దక్కించుకున్న సినీ ప్రముఖులు వీరే..
మనోజ్ పరమహంస: విజయ్ నటించిన 'బీస్ట్' చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన మనోజ్ పరమహంసకు విద్యా, సాంస్కృతిక రంగంలో కీలక బాధ్యతలు దక్కాయి. ఆయనను తమిళనాడు ప్రభుత్వ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హెడ్ గా ప్రభుత్వం నియమించింది.
జగదీష్ పళనిసామి: బ్లాక్బస్టర్ మూవీ 'లియో' సహ నిర్మాత, విజయ్ కు అత్యంత సన్నిహితుడైన జగదీష్ పళనిసామికి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవి దక్కింది. ఆయనను నేరుగా ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శిగా నియమించారు.
కేవీ నారాయణన్: ఇటీవల విజయ్ నటించిన 'జన నాయగన్ ' సినిమా నిర్మాత కేవీ నారాయణన్ కు జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.




Click it and Unblock the Notifications