'గుంటూరు కారం'... ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చూరులో చుట్ట కాలి మరొకడు!?
ఈనెల 12వ తేదీన విడుదలైన గుంటూరు కారం సినిమా ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. 13 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ఇది. మొదటినుంచి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే అభిమానులు, సినీ ప్రియుల ఆశలను నీరుకారుస్తూ నిస్సారమైన స్క్రీన్ ప్లే, కలగలపిన కథ కలిపి త్రివిక్రమ్ అందించాడు. విడుదలైన తర్వాత ఇది అసలు త్రివిక్రమ్ సినిమానేనా? ఆయనే దర్శకత్వం వహించారా? అనే అనుమానాలు అందరికీ కలిగాయి. అంతగా నిరాశపరిచింది ఈ సినిమా.
ఈ సినిమాకు రూ.130.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సినిమా బ్రేక్ ఈవెన్ అయి హిట్ గా నిలవాలంటే రూ.131 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. నాలుగు రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.83.7 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇంకా రూ.47.3 కోట్ల షేర్ రావాల్సి ఉంది. ఈ సినిమా ప్రాంతాలవారీగా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా, ఇతర రాష్ట్రాల్లోను విడుదలైంది. బయ్యర్లు బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేదా? అనే టెన్షన్ తో ఉన్నారు.

ఇదంతా ఒక ఎత్తయితే హీరో మహేష్ బాబు ఇంట్లో సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. మహేష్ బాబు, నమత్రతోపాటు గుంటూరు కారం హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి, దిల్ రాజు, నిర్మాత నాగవంశీ తదితరులు పాల్గొన్నారు. సక్సెస్ సెలబ్రేషన్స్ తోపాటు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కూడా జరిపారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటిరోజు మొదటి షో నుంచే సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. అయినా మహేష్ బాబుకు ఉన్న ఇమేజ్ పరంగా, సంక్రాంతి సెలవులను కలుపుకొని సాధ్యమైనంతవరకు కలెక్షన్లు రాబట్టింది. బ్రేక్ ఈవెన్ అయి బయ్యర్లు నష్టపోకుండా వారు పెట్టిన రూపాయి పెట్టినట్లు వస్తే చాలనుకుంటున్నారు. వారు లాభాలను కూడా ఆశించడంలేదు.
నైజాంలో ఈ సినిమాను దిల్ రాజు విడుదల చేశారు. హనుమాన్ చిత్రానికి థియేటర్లు దొరక్కుండా ఈయన ఎటువంటి రాజకీయం చేశాడో మనందరం చూసిందే. తాను డిస్ట్రిబ్యూట్ చేశాడు కాబట్టి అతని చొరవతోనే, అతని ఆలోచన ప్రకారమే ఈ వేడుక జరిగింది. దీనివల్ల సినిమా ఫ్లాప్ అవలేదు.. హిట్ అయింది.. టాక్ బాగుంది.. సెలబ్రేషన్స్ కూడా జరిపారు అనే ఫీల్ ను ప్రేక్షకుల్లోకి పంపించి స్టడీగా కలెక్షన్లు రాబట్టడం కోసమే ఇలాంటి ఎత్తుగడ వేసినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో మూడు రోజులు గడిస్తే గుంటూరు కారం పరిస్థితి ఏమిటి? అనేదానిపై పూర్తి స్పష్టత వస్తుంది.

ఈ సినిమా మొదటిరోజు రూ.94 కోట్లు వసూలు చేసిందని పోస్టర్ విడుదల చేశారు. ఇందులో కూడా ఫేక్ కలెక్షన్లు ఉన్నాయని, గుంటూరు కారం సినిమాకు మొదటిరోజు రూ.80 కోట్లకు మించి వసూలు చేయలేదని కొందరంటున్నారు. తాజాగా ఈ సినిమా ఫేక్ రివ్యూలపై అందరి దృష్టి పడింది. దీనిపై ఫిల్మ్ ఛాంబర్ స్పందించింది. బుక్ మై షోకి ఓ లేఖ రాసింది. గుంటూరు కారం మూవీకి ఫేక్ రేటింగ్స్ ఇచ్చిన వాళ్ల వెనక ఎవరు ఉన్నారనే విషయాన్ని విచారణ జరిపి తెలుసుకోవాలని బుక్ మై షోని ఫిల్మ్ ఛాంబర్ కోరింది.












Click it and Unblock the Notifications