డబ్బులు అడుగుతున్న టీడీపీ ఎమ్మెల్యే?
రాష్ట్రంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త తరహా నేరంతో కేటుగాళ్లు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. అంతేకాదు.. సామాజిక మాధ్యమాల్లో ఖాతాలను ఉపయోగించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ తరహా మోసాలు ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్నాయి. ఫేస్బుక్లో ఖాతా ప్రారంభించి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపిస్తున్నారు. తర్వాత అర్జంటుగా డబ్బులు అవసరమైందంటూ ఎదుటివారిని కంగారుపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. తర్వాత ఆ ఖాతా ఫేస్బుక్ నుంచి మాయమవుతోంది.
అత్యవసరంగా డబ్బులు కావాలంటూ..
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని తాడికొడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తెనాలి శ్రావణ్ కుమార్ కూడా సైబర్ కేటుగాళ్ల బారిన పడ్డారు. శ్రావణ్ కుమార్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతా తెరిచి రాజధాని ఎమ్మెల్యే పేరుతో ప్రజలతో చాటింగ్ చేస్తున్నారు. అత్యవసరంగా డబ్బులు అవసరపడ్డాయని తర్వాతరోజు ఇచ్చేస్తానంటూ నమ్మించారు. అయితే దీనిపై అప్రమత్తమైన కొందరు ఈ విషయంపై ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కు సమాచారం ఇచ్చారు.

దర్యాప్తు చేయాలంటూ ఆదేశం
దీనిపై ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వొద్దని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. సైబర్ నేరస్తుల చేతిలో మోసపోకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్ లైన్ లో ఎవరూ డబ్బులు అడగరని, ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఎవరూ డబ్బులు పోగొట్టుకోవద్దన్నారు. వెంటనే దీనిపై దర్యాప్తు చేయాలని తన పరిధిలోని పోలీసు అధికారులను ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఆదేశించారు.
నకిలీ ఖాతాలను గుర్తించండి
'తెలుగుదేశం పార్టీ అభిమానులకు, నాయకులకు, నా శ్రేయోభిలాషులకు మనవి.. "Tenali Srawan Kumar" అనే పేరు మీధ నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించిన నేరగాళ్లు నేను డబ్బు అడుగుతున్నట్లు మెసేజ్ లు చేయడంతోపాటు చాటింగ్ చేస్తున్నారని, దయచేసి ఎవరు దానికి స్పందించవద్దని, ఇటువంటి సంఘటనలు నా దృష్టికి తీసుకురావాలంటూ శ్రావణ్ కుమార్ పోస్ట్ పెట్టి అందర్నీ అలర్ట్ చేశారు.












Click it and Unblock the Notifications