బాలయ్య, పవన్ కల్యాణ్ దృష్టిలో 'న్యాయం' అంటే వేరు?
తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను భారత రాష్ట్ర సమితికి చెందిన సోషల్ మీడియాలో అసభ్యకరంగా ట్రోల్ చేయడంతో ఆమె అదుపు తప్పి మాట్లాడారు. కేటీఆర్ దీనిని కారణమని చెబుతూ నాగార్జున కుటుంబాన్ని వివాదంలోకి లాగారు. సినీ పరిశ్రమ నుంచి కొంతమంది హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేశారని, పరిశ్రమ నుంచి పెళ్లిళ్లు చేసుకొని వెళ్లిపోవడానికి కూడా కేటీఆరే కారణమని విమర్శించారు. నాగచైతన్య-సమంత విడాకులకు కూడా కేటీఆర్ కారణమంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే కొన్ని వ్యాఖ్యలు చేయడంతో తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ముక్త కంఠంతో సురేఖ వ్యాఖ్యలను ఖండించింది.
నాగార్జునతో బాలయ్యకు పొసగదు
అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన నందమూరి బాలకృష్ణ, ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. సురేఖ వ్యాఖ్యలను ఖండించలేదు. బాలయ్యకు రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయి. అలాగే మంత్రి సురేఖతోను సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అక్కినేని నాగార్జునకు, బాలయ్యకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం తెలిసిందే. బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలకు కూడా నాగార్జునను ఆహ్వానించలేదా? లేదంటే ఆయన రాలేదా? అనేదానిపై స్పష్టత లేదు. ఈ కోణంలో ఆయన అక్కినేని కుటుంబం కాబట్టి స్పందించలేదని భావిస్తున్నారు.

పవన్ కు రేవంత్ ఆత్మీయ సన్మానం
మరోవైపు పవన్ కల్యాణ్ హైడ్రా నిర్ణయాన్ని స్వాగతించారు. హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. రేవంత్ రెడ్డి పవన్ కల్యాణ్ కు ఆత్మీయంగా సన్మానం చేశారు. మహిళల అభివృద్ధి, అభ్యున్నతి గురించి, వారి గౌరవ మర్యాదల గురించి తరుచుగా మాట్లాడే పవన్ కల్యాణ్ రేవంత్ క్యాబినెట్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు ఎటువంటి స్పందనా ఇవ్వకపోవడం గమనార్హం. సురేఖ తన వ్యాఖ్యలను ఉపసింహరించుకున్నప్పటికీ బాలయ్య, పవన్ నుంచి మాత్రం స్పందన రాలేదు. రాజకీయాలు వేరు.. మహిళల గౌరవం కాపాడటం వేరు అనే విషయాన్ని ఈ ఇద్దరు హీరోలు, రాజకీయ నేతలు గుర్తెరగాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
న్యాయం అంటే వేరా?
బాలయ్య, పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకులుగా ఉన్నారు. అలాగే అధికార ప్రభుత్వంలో ఒకరు ఉప ముఖ్యమంత్రిగా, మరొకరు మూడుసార్లు గెలిచిన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత సంబంధిత ప్రజాప్రతినిధిపై ఉంటుంది. న్యాయం కోసం వారి దగ్గరకు వచ్చినప్పుడు కచ్చితంగా న్యాయంవైపే నిలబడాలి. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలనే నీతి ఒకటి మన దేశంలో ఎప్పటినుంచో ప్రాచుర్యంలో ఉంది. నాగార్జునతో బాలయ్యకు పొసగకపోయినా, రేవంత్ తో పవన్ కు సన్నిహిత సంబంధాలున్నా సమంత పేరును, నాగార్జున, నాగచైతన్య పేరును బయటకు లాగారు కాబట్టి న్యాయం ఎటువైపు ఉందో ఆలోచించి అటువైపు నిలబడితే మంచిదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అలా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచిస్తే చివరకు ఆ రాజకీయం అరాజకీయంగా ఉంటుందంటున్నారు.












Click it and Unblock the Notifications