పవన్ కల్యాణ్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. తనకిష్టమైన ఐదు శాఖలను పర్యవేక్షిస్తూ వాటిల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఓఎస్డీగా జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్న యువ అధికారిని నియమింపచేసుకున్నారు. తను చేయాల్సిన సినిమాలు మూడు పెండింగ్ లో ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో వీరమల్లుకు ఈ ఏడాది చివరలో డేట్లు ఇస్తానని చెప్పారు. ఇటీవల వచ్చిన వరదలకు నష్టపోయిన రాష్ట్రానికి రూ.6 కోట్ల విరాళం ప్రకటించారు.
మంచి కార్యక్రమాలతో ముందుకు
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం పూర్తిచేశారు. ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకొని ఈనెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా మారిన ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా చేస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఇటీవలే ఈయన కూడా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు చెరి రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. ఇలా వీరిద్దరూ మంచి కార్యక్రమాలతో ముందుకు వెళుతుండటంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చు
రాజకీయాల్లో పవన్ బిజీ కాకముందు ఎన్టీఆర్-పవన్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ సినిమా తీయడానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రయత్నాలు చేశారు. ఈ హీరోలిద్దరికీ దర్శకుడు చెప్పిన కథ నచ్చింది. కొన్ని అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. కార్యరూపం దాల్చివుంటే రికార్డులు బద్దలై ఉండేవని అభిమానులు అంటున్నారు.
అంతేకాదు ఈ సినిమాతో తెలుగులో టాప్ దర్శకుడిగా త్రివిక్రమ్ కొనసాగేవారు. ప్రస్తుతం పవన్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అయ్యారు. భవిష్యత్తులో వీరిద్దరి కాంబినేషనల్ లో సినిమా రావడం కష్టమనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. అయితే సినిమాల్లోకానీ, రాజకీయాల్లోకానీ ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చు.












Click it and Unblock the Notifications