మహేష్ బాబు - వెంకటేష్ కలిసి కొత్త బిజినెస్
ప్రిన్స్ మహేష్ బాబు సినిమాల్లో నటించడంద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇతర వ్యాపారాల్లోకి మళ్లిస్తుంటారు. ఆ కోవలోనే ఆయన గచ్చిబౌలిలో ఏఎంబీ మాల్ నిర్మించారు. దీంతోపాటు మరికొన్ని వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టారు. తాజాగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ ను కూడా మల్టీప్లెక్స్ గా మార్చాలనే యోచనలో ఉన్నారు. అయితే ఈ వ్యాపారంలో ఆయనొక్కడే కాకుండా మరో ఇద్దరు కూడా భాగస్వాములుగా ఉన్నారు. వారిలో ఒకరు అగ్ర కథానాయకుడు వెంకటేష్ కాగా, మరొకరు ఏషియన్ కంపెనీ సునీల్ నారంగ్.
సుదర్శన్ థియేటర్ లో మహేష్ బాబు, వెంకటేష్ సినిమాలు ఎక్కువగా ఆడేవి. తర్వాత అది మూతపడిపోయింది. తాజాగా దీని స్థానంలో ఏడు స్క్రీన్లు కలిగిన మల్టీప్లెక్స్ కట్టాలని నిర్ణయించారు. ఏఎంబీ విక్టరీ అనే పేరును నిర్ణయించారు. ఏ అంటే ఏషియన్, ఎంబీ అంటే మహేష్ బాబు, విక్టరీ అనేది వెంకటేష్ బిరుదు. వీటిని మల్టీప్లెక్స్ పేరుగా పెడుతున్నారు. వాస్తవానికి థియేటర్ల బిజినెస్ వెంకటేష్ కు కొత్త కాదు. తన తండ్రి రామానాయుడితోపాటు సోదరుడు సురేష్ బాబు కూడా వీటిని నిర్వహిస్తున్నారు. అందులో వెంకీ భాగస్వామిగా ఉన్నారు. అయితే కొత్తగా తన పేరుమీద సొంతంగా నిర్మించడం మాత్రం ఇదే తొలిసారి అవుతోంది.

అమీర్ పేట సత్యం థియేటర్ ను అల్లు అర్జున్ ఏషియన్ సంస్థతో కలిసి ఏషియన్ సత్యం ఏఏగా మార్చారు. అలాగే విజయ్ దేవరకొండ కూడా మహబూబ్ నగర్ లో మల్టీప్లెక్స నిర్మించారు. రవితేజ దిల్ షుక్ నగర్ లో మల్టీప్లెక్స నిర్మించబోతున్నారు. హీరో నాని కూడా ఇదే మార్గంలో పయనిస్తున్నారు. దీనిపై కొంత స్పష్టత రావాల్సి ఉంది. సినిమాల్లో సంపాదించిన డబ్బును తిరిగి సినిమా రంగానికి చెందినవాటిపైనే వెచ్చించడం అనేది హర్షణీయమని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుదర్శన్ థియేటర్ స్థానంలో అతి త్వరలోనే మల్టీప్లెక్స్ నిర్మాణం ప్రారంభం కాబోతోంది. ఇంకా ఎంతమంది హీరోలు థియేటర్ల వ్యాపారాల్లోకి ప్రవేశిస్తారో చూడాలి మరి.












Click it and Unblock the Notifications