చిరంజీవి వద్దంటే బాలయ్య బ్లాక్ బస్టర్ కొట్టాడు
చిరంజీవి నిరాకరించిన 'కథానాయకుడు' చిత్రంతో నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుని తన కెరీర్లో మరో మైలురాయిని నమోదు చేసుకున్నారు. పరుచూరి బ్రదర్స్ రాసిన ఈ కథను మొదట మెగాస్టార్ చిరంజీవికి వినిపించారు. అయితే కథలో కథానాయకుడి పాత్ర కంటే శారద పోషించిన అక్క పాత్రకే ప్రాధాన్యత ఎక్కువగా ఉందని, హీరో రోల్ కొంత తక్కువగా కనిపిస్తుందని భావించి చిరంజీవి ఈ ప్రాజెక్ట్ను నిరాకరించారు. ఆ తర్వాత సూపర్స్టార్ కృష్ణ, సుమన్ వంటి అగ్ర కథానాయకులు కూడా ఇదే కారణంతో ఈ కథను వదులుకున్నారు.
బాలయ్య ఓకే అన్నారు
అయితే దర్శకుడు కె. మురళీ మోహన రావు ఈ కథను బాలకృష్ణకు వివరించగా, అందులోని బలమైన కుటుంబ సెంటిమెంట్ నచ్చి ఆయన వెంటనే నటించడానికి పచ్చజెండా ఊపారు. ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలకృష్ణ సరసన విజయశాంతి కథానాయికగా నటించగా, శారద అక్క పాత్రలో ఒదిగిపోయారు. గొల్లపూడి మారుతీరావు, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య వంటి దిగ్గజ నటులు ఇతర ముఖ్య పాత్రల్లో మెరిశారు.

చక్రవర్తి స్వరాలు ప్రధాన ఆకర్షణ
1984 డిసెంబరు 14న విడుదలైన ఈ చిత్రానికి కె. చక్రవర్తి అందించిన స్వరాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఎందరో హీరోలు నిరాకరించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించి, బంపర్ హిట్గా నిలిచింది. బాలకృష్ణ నటనకు, ముఖ్యంగా అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ విజయం బాలకృష్ణ ప్రారంభ కెరీర్లో మాస్ ఫ్యామిలీ ఆడియెన్స్లో ఆయన ఇమేజ్ను మరింత బలపరిచింది. ఈ సినిమా తర్వాత బాలయ్య మాస్ సినిమాలు ఎక్కువ చేయడం మొదలుపెట్టి, తిరుగులేని మాస్ హీరో అయ్యారు.














Click it and Unblock the Notifications