పెట్రోల్ కావాలంటే ఇక 'ఓన్లీ క్యాష్'- బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..!!
పెట్రోల్ బంకులకు వెళ్లే వినియోగదారులకు బిగ్ అలర్ట్. బంకుల్లో యూపీఐ పేమెంట్స్ పరిమితం గా అమలు కానున్నాయి. పూర్తి స్థాయిలో యూపీఐ పేమెంట్ చేసే అవకాశం లేదు. దీంతో.. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు పరిమితి దాటితే నగదు పేమెంట్ చేయాలని సూచిస్తున్నాయి. దీంతో, ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్స్ కు అలవాటు పడిన వినియోగదారులు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తోంది.
పెట్రోల్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 15 నుంచి అమలు చేయనున్న నూతన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) నిబంధనలపై దేశవ్యాప్తంగా పెట్రోల్ పంప్ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఫ్రేమ్వర్క్ ప్రకారం రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన ఇంధన యూపీఐ లావాదేవీలపై వ్యాపారుల నుంచి 0.4 శాతం ఎమ్డీఆర్ చార్జీ వసూలు చేయనున్నారు. ఈ నిర్ణయంపై డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కార్లు, భారీ లారీలు, ట్రక్కులకు ఇంధనం నింపేటప్పుడు రూ. 3,000 నుండి రూ. 10,000 వరకు యూపీఐ చెల్లింపులు జరుగుతాయని, ఈ అదనపు భారాన్ని భరించడం తమ వల్ల కాదని స్పష్టం చేస్తున్నారు.

ఇంధనం అత్యవసర సరుకు అయినందున పెట్రోల్ బంకులకు ఎమ్డీఆర్ నుంచి పూర్తి మినహా యింపు ఇవ్వాలని... లేకపోతే అక్టోబర్ 15 నుంచి రూ. 2,000 పైబడిన ఇంధన కొనుగోళ్లకు యూపీఐ డిజిటల్ చెల్లింపులను నిలిపివేసి, కేవలం నగదు రూపంలో మాత్రమే స్వీకరిస్తామని హెచ్చరిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పెట్రోల్ పంప్ డీలర్లు వాహనదారుల కు హెచ్చరిక జారీ చేసినట్టు సమాచారం.
రూ.2000 కంటే ఎక్కువ ఇంధనాన్ని కొనుగోలు చేస్తే చెల్లింపు నగదులోనే ఉండాలని, ఇలాంటి సందర్భాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ యూపీఐ చెల్లింపులు అంగీకరించబోమని చెబుతున్నారు. ఓవైపు నిర్వహణ ఖర్చుల పెరుగుదల, మరోవైపు తగ్గని ముడిచమురు ధరలు నడుమ ఎండీఆర్ పేరిట విధించే ఈ అదనపు ఛార్జీలను తాము భరించలేమని వాపోతున్నారు. ఈ తరుణంలో తాము నగదు చెల్లింపునకే పరిమితం కావడానికి సిద్ధమయ్యామని తెలిపారు. దీంతో.. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది స్పష్టత రావాల్సి ఉంది.














Click it and Unblock the Notifications
