Lalbaugcha Raja: గణపయ్య హుండీలో కాసుల వర్షం. ఏకంగా రూ.3.18 కోట్లు..
ముంబై నగరం గణేష్ నవరాత్రుల శోభతో పులకించిపోతోంది. దేశవ్యాప్తంగా లంబోదరుడి దర్శనం కోసం కోట్లాది మంది భక్తులు మహారాష్ట్రలోని ప్రసిద్ధ గణపతి మండపాలకు క్యూ కడుతున్నారు. విశేషించి, దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన లాల్బావ్చా రాజా గణనాథుడు దర్శనానికి నిత్యం వేలాది మంది క్యూ లైన్లలో నిలబడుతున్నారు. గణేష్ ఉత్సవాలు ప్రారంభమైన తొలి మూడు రోజుల్లోనే లాల్బావ్చా రాజా హుండీల్లో భక్తులు కనకవర్షం కురిపించారు. ఏకంగా రూ. 3.18 కోట్ల విలువైన విరాళాలు సమర్పించినట్లు మండప నిర్వహణ కమిటీ వెల్లడించింది.
హుండీల్లో కేవలం భారతీయ కరెన్సీయే కాకుండా బంగారం, వెండితో పాటు విదేశీ డాలర్లు కూడా పోటెత్తాయి. గణాంకాల ప్రకారం.. తొలి మూడు రోజుల్లో రూ. 1.9 కోట్ల కరెంట్ క్యాష్ రాగా, రూ. 98.9 లక్షల విలువైన 647.47 గ్రాముల బంగారం, అలాగే రూ. 30.35 లక్షల విలువైన 12.38 కేజీలకు పైగా వెండి ఆభరణాలు, కానుకలు వచ్చిపడ్డాయి. బంగారంలో గొలుసులు, గాజులు ప్రధానంగా ఉండగా, వెండి రూపంలో పెన్నులు, అందంగా చెక్కిన వెండి క్రికెట్ బ్యాట్లు కూడా భక్తులు భక్తిశ్రద్ధలతో లంబోదరుడికి సమర్పించుకున్నారు. ఇక అమెరికన్ డాలర్లతో పాటు పలు ఇతర విదేశీ కరెన్సీ నోట్లు కూడా హుండీలో లభ్యమయ్యాయి.

ప్రత్యేక భద్రతల నడుమ లెక్కింపు.. మహానగర ప్రముఖుల క్యూ!
నిత్యం పూజా కార్యక్రమాలు ముగిసిన వెంటనే నిర్వాహకులు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రతినిధులు, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారుల సమక్షంలో నిబంధనల ప్రకారం హుండీలను తెరిచి లెక్కిస్తున్నారు. ఈ విరాళాల సొమ్మును ప్రత్యేక బ్యాంక్ ఖాతాల్లో జమ చేసి, ఏడాది పొడవునా ట్రస్ట్ నిర్వహించే పలు సామాజిక, సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు. ఇక ఈ ప్రతిష్టాత్మక లాల్బావ్చా రాజాను దర్శించుకునేందుకు సామాన్యులతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దంపతులు, అంబానీ కుటుంబ సభ్యులు, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్ వంటి ఎంతోమంది ప్రముఖులు క్యూ కట్టడం విశేషం.
పర్యావరణ స్పృహ.. ప్రసాదం వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి!
కేవలం ఆధ్యాత్మికత, భక్తి శ్రద్ధలే కాకుండా ఈసారి లాల్బావ్చా రాజా మండలి పర్యావరణ పరిరక్షణలోనూ సరికొత్త ఆదర్శంగా నిలుస్తోంది. బీఎమ్సీతో చేతులు కలిపి మండపం వద్ద తయారయ్యే ప్రసాదం వ్యర్థాలను విద్యుత్ శక్తిగా మార్చే వినూత్న ప్రాజెక్టును చేపట్టింది. వ్యర్థాలను ముంబైలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఉన్న బయోమెథనేషన్ ప్లాంట్లకు తరలించి, దాని ద్వారా దాదాపు 7,744 యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భక్తితో పాటు పర్యావరణ హితాన్ని చాటుతున్న లాల్బావ్చా రాజా ఉత్సవాలు ముంబైలో విశేష ఆదరణ పొందుతున్నాయి.














Click it and Unblock the Notifications
