సుకుమార్ వంకర ఆలోచనవల్లే చేతులు మారిన సినిమా?
సానా బుచ్చిబాబు - రామ్ చరణ్ కాంబినేషన్ లో ఇటీవలే ఓ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెహమాన్ స్వరాలందిస్తుండగా మైత్రీమూవీస్ తోపాటు మరో రెండు బ్యానర్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీకపూర్ కథానాయిక. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. కోడి రామ్మూర్తినాయుడి జీవిత చరిత్ర అని కొందరు చెబుతుండగా మరికొందరు స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ నేపథ్యంలో సినిమా రూపుదిద్దుకుంటోందని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమా పూర్తవగానే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరగనుంది.
వాస్తవానికి ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తో తీయాలని బుచ్చిబాబు కథను సిద్ధం చేసుకున్నారు. కథను తారక్ కు కూడా వినిపించగా ఓకే చెప్పాడు. తరుచుగా బుచ్చిబాబు కథను, స్క్రిప్ట్ ను సిద్ధం చేసే సమయంలో తన గురువు సుకుమార్ తో సంప్రదింపులు జరుపుతుంటాడు. తారక్ కు కథ వినిపించిన తర్వాత కూడా మార్పులు చేర్పులపై సుకుమార్ ను కలవగా.. ఈ కథ తారక్ కన్నా రామ్ చరణ్ కైతే చాలా బాగుంటుందని, చెర్రీని కలిసి కథను వివరించాలని శిష్యుడికి సూచించాడు. దీంతో బుచ్చిబాబు రామ్ చరణ్ కు కలిసి కథను వివరించగా ఓకే చెప్పాడు. దీంతో చెర్రీతో బుచ్చిబాబు సినిమా ఖరారైంది.

వాస్తవానికి సుకుమార్ వల్లే ఇటువంటి మంచి కథతో కూడిన సినిమా తారక్ దగ్గరనుంచి జారిపోయిందంటూ సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. ఒక దర్శకుడి కథలో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పాలని, అంతేకానీ వారికి బాగుంటుంది.. వీరికి బాగోదు.. ఆయనైతే బాగుంటుంది.. ఆయనైతే బాగోదు.. లాంటి చచ్చు సలహాలివ్వకుండా ఉంటే భవిష్యత్తులోనైనా మేలు జరుగుతుందని, ఈ విషయాన్ని సుకుమార్ గమనించాలంటూ తారక్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి ఇతర సినిమాలతో బిజీగా ఉండటంవల్లే తారక్ కథను చెర్రీ దగ్గరకు పంపించాడనే వార్తలు వచ్చాయి. అయితే ఇందులో వాస్తవమెంత అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications