మహిళలకు మరో బంపర్ బొనాంజా... వ్యాపారవేత్తలుగా ఎదిగేలా!
తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఇప్పటికే ఇందిర మహిళా శక్తి పథకం ద్వారా మహిళల తోటి క్యాంటీన్ లను ఏర్పాటు చేసింది.
మహిళలు ఆర్ధికంగా ఎదిగేలా సీఎం రేవంత్ నిర్ణయం
మహిళా సూపర్ బజార్లు, మహిళలకు డ్రోన్ ట్రైనింగ్, మహిళలకు కుట్టు మిషన్లు, మహిళా పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులను మహిళా సంఘాల ద్వారా నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేస్తుంది.ఇదే క్రమంలో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళలను ఆర్థికంగా పరిపుష్టి చేయాలని నిర్ణయించుకున్న క్రమంలో మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి నిర్ణయించిన రేవంత్ రెడ్డి మహిళా సంఘాలతో మిల్లును నిర్వహించాలని నిర్ణయించారు.

డీఫాల్ట్ అయిన మిల్లులు స్వాధీనం చేసుకుని మహిళలతో నిర్వహించాలనే ఆలోచన
కొందరు మిల్లర్లు ఉద్దేశపూర్వకంగా బకాయిలు చెల్లించటం లేదని డిఫాల్ట్ అయిన రైస్ మిల్లులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిన సీఎం రేవంత్ ఆ మిల్లుల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. దీనివల్ల మహిళలకు ఆర్థికంగా మంచి అవకాశం లభిస్తుందని తెలిపారు. ఈ అంశంపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి ఫైనల్ గా నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
సీఎం రేవంత్ నిర్ణయంపై మంత్రి సీతక్క హర్షం
ఇక తాజాగా మహిళా సంఘాలకు మిల్లింగ్ బాధ్యతలను అప్పగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పైన మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. మహిళల సాధికారతకు సీఎం తీసుకున్న నిర్ణయం ఒక ముందడుగని మంత్రి సీతక్క కొనియాడారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం నిల్వ కేంద్రాల ఏర్పాటుతో మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఈ సందర్భంగా మంత్రి సీతక్క వెల్లడించారు.
మహిళా సంఘాలకు కొత్త అవకాశాలు
మిల్లింగ్ లోను, ధాన్యం నిలువ రంగాలలోనూ మహిళా సంఘాలకు కొత్త అవకాశాలు లభిస్తాయని చెప్పారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే, మహిళా సంఘాలను నిర్ణయాత్మక ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. సీఎం నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు గొప్ప ఉపాధి, ఆదాయ అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రధానంగా మహిళలకు సముచిత స్థానం ఇవ్వటానికి నిర్ణయం తీసుకుంది.













Click it and Unblock the Notifications