ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సూపర్స్టార్ రజినీకాంత్..
తలైవా అభిమానులకు గుడ్న్యూస్.. సూపర్స్టార్ రజినీకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సూపర్స్టార్ పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిన్న (గురువారం) ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేశాయి. ఇక తాజాగా, నేటి (శుక్రవారం) ఉదయం సూపర్స్టార్ను డిశ్చార్జ్ చేసినట్టు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. మరో నాలుగు రోజుల్లోనే సూపర్ స్టార్ నటించిన చిత్రం దసరా కానుకుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సమయంలో ఆయన అస్వస్థతకు గురికావడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
చికిత్స అనంతరం కోలుకున్న రజనీకాంత్ ఆరోగ్యం కుదుటపడటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చెన్నై అపోలో ఆస్పత్రి నుంచి ఆయన నేరుగా ఇంటికి వెళ్లినట్లు సమాచారం. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడటంతో డాక్టర్లు రజనీకాంత్కు స్టెంట్ అమర్చారు. ట్రాన్స్కాథెటర్ పద్ధతి ద్వారా సూపర్స్టార్కు స్టెంట్ వేసినట్టు అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. తమ అభిమాన నటుడు అనారోగ్యం నుంచి కోలుకుని డిశ్చార్జ్ కావడంతో..రజనీకాంత్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

మీడియా ముందుకు వచ్చిన రజనీ భార్య...
సూపర్స్టార్ రజనీకాంత్ గత నెల 30వ తేదిన ఛాతిలో తీవ్రమైన నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు వెంటనే చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గుండె నుంచి బయటికి వచ్చే రక్తనాళంలో వాపు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయనకు స్టెంట్ అమర్చారు. ఆ తర్వాత రెండు రోజులు అబ్జర్వేషన్లో ఉంచారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో శుక్రవారం ఉదయం ఆయనను ఇంటికి పంపారు. తలైవా త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు చేశారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ భార్య లతా మీడియా ముందుకు వచ్చి స్పందించారు. రజనీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె ప్రకటించారు.












Click it and Unblock the Notifications