చంద్రబాబు, పవన్కల్యాణ్తో 'గేమ్స్' ఆడుతున్న సినీ పరిశ్రమ పెద్దలు!
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన హీరోలు, నిర్మాతలు, దర్శకులు, 24 విభాగాలకు చెందిన ప్రముఖులంతా కలిసి ఈనెల 15వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో సమావేశం కావాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా ఈ సమావేశం వాయిదా పడింది. సినీ పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలు దీన్ని వాయిదా వేయించారు. హీరోలు, దర్శకులు, మరికొందరు ప్రముఖులు అందుబాటులో లేకపోవడంతో ఆ సమావేశం వాయిదా పడటానికి కారణమైంది. తిరిగి ఎప్పుడు సమావేశం అవుతారు? అసలు అవుతారా? లేదా? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.
వంగి వంగి దండాలు పెడుతూ వెళ్లారు
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినీ పెద్దలంతా కలిసి వంగి వంగి దండాలు పెడుతూ వెళ్లి కలిశారు. అందుకు కారణం థియేటర్ టికెట్ ధరలు రూ.30, రూ.40 ఉండటమే. దీంతో అందరూ తప్పనిసరిగా కలిశారు. అలా కలవాల్సిన పరిస్థితిని జగన్ తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ అలాకాదు. మంచితనానికి పోయి వ్యక్తిగతంగా వచ్చి అడిగిన నిర్మాతలందరికీ టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు, తినబలిసిన కోడి ఇల్లెక్కి కూసినట్లు వారికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు లోకువై పోయారని సినీ విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయినప్పటికీ అందరూ కలిసివచ్చి ముఖ్యమంత్రిని కలవాలనే ఇంగిత జ్ఞానం లేదంటూ పవన్ కల్యాణ్ మండిపడటంతో 15న సమావేశానికి ముహూర్తం పెట్టుకున్నారు.

పరోక్షంగా హెచ్చరించిన దిల్ రాజు
అయితే ఆ ముహూర్తం దుర్ముహూర్తమైంది. కారణం కొందరు పెద్దలు. హీరోలు అందుబాటులో లేరని, దర్శకులు అందుబాటులో లేరని చెబుతున్నారు. కాల్షీట్లు అత్యవసరమైతే మార్చుకోవడానికి వారికి వచ్చిన నష్టం ఏముంది? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితో భేటీ అంటే షూటింగ్ ఉందంటూ వీరు చెబుతున్నచిలక పలుకులు నమ్మబలికే విధంగా లేవు. సినీ పరిశ్రమకు ఒక్క ఏపీ నుంచే 68 శాతం ఆదాయం వస్తోంది. నిర్మాతలు, దర్శకులు, ఎగ్జిబిటర్ల మధ్య భిన్నాభిప్రాయాలు, అంతర్గత విభేదాలే ఈ సమావేశం వాయిదా పడటానికి కారణం.

దీనికితోడు తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఉన్న దిల్ రాజు ఇటీవల మాట్లాడుతూ గద్దర్ అవార్డులు తీసుకోవడానికి రానివారందరికీ పరోక్షంగా హెచ్చరికలు జారీచేశారు. ఇదీ తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న పరిస్థితి. వీళ్లు మారరు. వీరి కోసం ప్రభుత్వాలు రాయితీలివ్వడం, థియేటర్ టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతులివ్వడం లాంటివి వెంటనే నిలిపివేయాలని మెజారిటీ ప్రజలు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications