థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడిన తెలుగు సినిమాలు ఇవే
ప్రస్తుతం విడుదలవుతున్న అగ్ర హీరోల సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్నాయి. వాటికి పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవాలంటే తక్కువ సమయంలో ఎక్కువ ధియేటర్లలో విడుదల చేస్తే బయటపడతామనే ఆలోచనలో నిర్మాతలుండటంతో విడుదలైన రెండు మూడు వారాలకల్లా సినిమాలన్నీ కనుమరుగవుతున్నాయి.
పైరసీతోపాటు వెబ్ సైట్లలో సినిమాలు అప్ లోడ్ చేస్తుండటం కూడా మరో కారణమవుతోంది. ప్రస్తుతం అయితే పరిస్థితి ఇలా ఉందికానీ గతంలో థియేటర్లలో సంవత్సరాల తరబడి సినిమాలు నడిచిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. థియేటర్ల ఊళ్ల నుంచి ఎడ్లబండ్లు కట్టుకొని మరీ వచ్చి సినిమా చూసివెళ్లేవారు.

టాలీవుడ్ లో గతంలో శతదినోత్సవాలు, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరిగేవి. కొన్ని సినిమాలు ఏడాదికిపైగా ఆడాయి. వాటిల్లో బాలకృష్ణ సినిమాలు రెండు ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో లెజెండ్ సినిమా 1000 రోజులకుపైగా ఆడింది. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో ఈ సినిమా వచ్చింది. 2014లో విడుదలై 2017 వరకు ఒకే థియేటర్ లో ఆడుతూనే ఉంది. దీనికి సంబంధించిన ప్రత్యేక పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

రాజమౌళి-రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన మగధీర సినిమా అప్పట్లోనే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. 2009లో విడుదలైన ఈ సినిమా కర్నూలు జిల్లాలోని విజయలక్ష్మి థియేటర్ లో 1000 రోజులు ప్రదర్శితమైంది.
మహేష్ బాబు - పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మహేష్ బాబుకు మైలురాయిగా నిలిచిపోయింది. ఓ థియేటర్ లో ఏకంగా 580 రోజులు ఆడింది.

కోడిరామకృష్ణ దర్శకత్వంలో బాలయ్య నటించిన మంగమ్మగారి మనవడు సినిమా 1984లో విడుదలైన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హైదరాబాద్ లోని తారకరామా థియేటర్ లో ఏకంగా 565 రోజులు ప్రదర్శితమైంది.
కమల్ హాసన్ నటించిన మరోచరిత్ర కూడా అప్పట్లోనే చరిత్ర సృష్టించింది. ఓ థియేటర్ లో 556 రోజులు ఆడింది.
దాసరి నారాయణరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమాభిషేకం సంచలన విజయం సాధించింది. ఆరోజుల్లోనే థియేటర్లలో 533 రోజులు ఆడటమే కాకుండా ఎక్కువ థియేటర్లలో 300 రోజులకు పైగా ఆడింది.
నందమూరి తారకరామారావు నటించి లవకుశ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1963లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో 469 రోజులు ప్రదర్శితమై రికార్డు నెలకొల్పింది.
తమిళంలో స్టార్ హీరోగా కొనసాగుతున్న శింబు తండ్రి టి.రాజేందర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ప్రేమసాగరం. పెద్ద సంచలనాన్ని సృష్టించిన ఈ సినిమా 465 రోజులు ఆడింది.












Click it and Unblock the Notifications